Ukraine Crisis: ఈ టైంలో పుతిన్‌ మనసు మార్చగలిగేది ఆ ఒక్కడే!

8 Mar, 2022 14:03 IST|Sakshi

ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మనసును మార్చగలిగేది ఒక్కరేనని అంటున్నాడు ప్రముఖ ఆర్థికవేత్త స్టీఫెన్‌ రోచ్‌. ఆ ఒక్కరు ఎవరో కాదు.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. 

ఉక్రెయిన్‌ రష్యాల మధ్య యుద్ధం హోరాహోరీగా కొనసాగుతోంది. రష్యా బలగాల పోరాటాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్‌ సైన్యం. అయితే నష్టం మాత్రం భారీగానే ఉంటోంది. యుద్ధం మధ్యే శాంతి చర్చలు, పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది కూడా. ఈ తరుణంలో మొండిగా ముందుకెళ్తున్న పుతిన్‌ను ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఒక్క జింగ్‌పిన్‌ మాత్రమేనని అమెరికన్‌ ఎకనమిస్ట్‌ స్టీఫెన్‌ అభిప్రాయపడుతున్నారు. 

సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌ పరిణామాల విషయంలో పుతిన్‌ మనసును మార్చగలిగే ప్రపంచలోని ఏకైక వ్యక్తి జిన్‌పింగ్‌ మాత్రమే. వాళ్లిద్దరి మధ్య బంధం అలాంటిది. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలతో పాటు రాజకీయ అవగాహన కూడా ఉంది. చైనా ఈ వ్యవహారంలో ట్రంప్‌కార్డుగా వ్యవహరిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ఉద్రిక్తతలను ఆపగలిగే శక్తి నా దృష్టిలో ఇప్పుడు జీ జిన్‌పింగ్‌ ఒక్కరికి మాత్రమే ఉంది. ఆయనొక్కడే ఇప్పుడు పుతిన్‌ను ప్రభావితం చేయగలరు’’ అని స్టీఫెన్‌ పేర్కొన్నాడు. 

ఇదిలా ఉండగా.. రష్యాతో తమ బంధం ఎంతో బలమైందని, అందుకే ఈ వ్యవహారంలో స్థిమితంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. అవసరమైతే ఇరు దేశాల(ఉక్రెయిన్‌-రష్యా) మధ్య సంధి కోసం ప్రయత్నిస్తామంటూ ఆఫర్‌ కూడా ఇచ్చింది. ఇంకోపక్క రష్యాపై ఆంక్షలను చైనా ఖండిస్తూ వస్తోంది.

చదవండి: ఉక్రెయిన్‌లో నెత్తుటి, కన్నీటి నదులు పారుతున్నాయి

మరిన్ని వార్తలు