ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ బ్లాక్‌లిస్టుపై... మోకాలడ్డిన చైనా

18 Sep, 2022 06:18 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: చైనా మరోసారి తన దుష్టబుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ ఐరాసలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను అడ్డుకుంది. 2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్‌ను భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.

ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 అల్‌–ఖైదా శాంక్షన్స్‌ కమిటీ కింద మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్, అమెరికా గురువారం ప్రతిపాదించాయి. దీన్ని చైనా  అడ్డుకుంది. 26/11 ముంబై దాడుల ఉదంతంలో పాత్రధారి అయిన మీర్‌ తలపై అమెరికా 5 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకాలాపాలకు నిధులు సమకూరుస్తున్నట్లు రుజువు కావడంతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ ఏడాది జూన్‌లో మీర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మరిన్ని వార్తలు