Galwan Clash: వీడియో విడుదల చేసిన చైనా

20 Feb, 2021 08:28 IST|Sakshi
గల్వాన్‌ ఘర్షణ నాటి దృశ్యాలు

వీడియో విడుదల చేసిన గ్లోబల్‌ టైమ్స్‌

భారత్‌పై ఆరోపణలు.. సార్వభౌమత్వ రక్షణ కోసమే దాడి: చైనా

బీజింగ్‌: భారత్‌-చైనా మధ్య గత 10 నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలను మోహరించాయి. పలు దఫాల చర్చల అనంతరం ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనా గతేడాది జరిగిన గల్వాన్‌ ఘర్షణలో తమ సైనికులు కేవలం నలుగురు చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ ఆఫ్‌ చైనా వారికి మరణానంతరం శౌర్య పురస్కారలను ప్రదానం చేయనున్నట్లు ఎల్‌ఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తాజాగా 2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ వీడియో ఫుటేజ్‌ను చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ విడుదల చేసింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు చనిపోయారు. ఈ గొడవల్లో తమ సైనికులు నలుగురు చనిపోయారని చైనా అంగీకరించింది. చైనా తరఫున విడుదలైన ఈ వీడియోలో చనిపోయిన నలుగురు సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఇరు సైన్యాల అధికారులు మాట్లాడుకోవడం కూడా కనిపిస్తుంది.

ఈ వీడియోలో చైనా పరోక్షంగా భారత్‌ను ఉద్దేశిస్తూ ‘‘ఏప్రిల్ నుంచి విదేశీ శక్తులు పాత ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయి. వంతెనలు, రోడ్డు వేయడం కోసం వాళ్లు సరిహద్దును దాటారు. త్వరత్వరగా నిఘా పూర్తి చేశారు" అని ఆరోపించింది. "విదేశీ శక్తులు యధాతథ స్థితిలో మార్పు తెచ్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారు. ఫలితంగా సరిహద్దుల్లో వేగంగా ఉద్రిక్తతలు పెరిగాయి, ఒప్పందాలను గౌరవిస్తూ మేం చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించడానికి చూశాం’’ అని పేర్కొంది.

ఈ వీడియో ఫుటేజిలో భారత, చైనా సైనికులు రాత్రి చీకట్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం కనిపిస్తోంది. అందులో చైనా సైనికులు గాయపడ్డ తమ సైనికుడిని తీసుకెళ్లడం కూడా ఉంది. అందులోనే చనిపోయిన తమ సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.

మా సైనికులు చనిపోయారు: చైనా
అంతకు ముందు చైనా ఆర్మీ అధికారిక పత్రిక పీఎల్ఏ డెయిలీని ప్రకారం ఒక వార్త ప్రచురించిన గ్లోబల్ టైమ్స్ "చైనా తన సార్వభౌమత్వాన్ని రక్షించుకోడానికి త్యాగాలు చేసిన సైనికులకు నివాళిగా వారి పేర్లు, వివరాలను మొదటిసారి వెల్లడించింది" అని తెలిపింది. కారాకోరమ్ పర్వతాల్లో చైనా సైన్యంలోని నలుగురు అధికారులు, సైనికులను చైనా సెంట్రల్ మిలిట్రీ కమిషన్ గుర్తించిందని వారిని తగిన పదవులతో సత్కరిస్తామని పీఎల్ఏ డెయిలీ శుక్రవారం తన రిపోర్ట్‌లో చెప్పుకొచ్చింది.

ఆ రిపోర్టులో చైనా ఆర్మీ మొదటిసారి గల్వాన్ ఘర్షణ గురించి వివరణాత్మక కథనం ఇచ్చింది. "భారత సైన్యం అక్కడికి పెద్ద సంఖ్యలో సైనికులను పంపించింది. వారంతా దాక్కున్నారు. చైనా సైన్యం వెనక్కు వెళ్లేలా బలవంతం చేశారు అని చెప్పింది. ఆ దాడుల సమయంలో చైనా సైనికులు స్టీల్ రాడ్లు, మేకులు ఉన్న రాడ్లు, రాళ్లతో తమ సౌర్వభౌమాధికారాన్ని ఎలా రక్షించుకున్నారో కూడా చైనా ఆర్మీ ఆ రిపోర్టులో వెల్లడించింది.

చదవండి: భారత్‌-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..!
                 గల్వాన్‌ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా

మరిన్ని వార్తలు