చైనాలో కోవిడ్‌ మరణ మృదంగం..అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు

22 Jan, 2023 20:05 IST|Sakshi

చైనాలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులతో కుదేలవుతోంది. దీనికి తోడు రోజుకు వేల సంఖ్యలో మరణాల సంభవించడంతో తీవ్ర భయాందోళనలతో సతమతమవుతోంది చైనా. అదీగాక బీజింగ్‌ కోవిడ్‌ ఆంక్షలు సడలించాక కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభమై అందర్నీ విస్మయపర్చింది. ఈ క్రమంలో ఇటీవలే ఒక వారంలోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో దాదాపు 13 వేల మరణాలు సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. మరణించిన వారిలో చాలామంది వైరస్‌ బారిన పడినవారేనని ఆరోగ్య అధికారి తెలిపారు.  

ఈ మేరకు చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) కేవలం కరోనాతో ఆస్పత్రుల్లో చేరి శ్వాసకోస వైఫల్యంతో  681 మంది మరణించారని, కరోనా తోపాటు ఇతర వ్యాధుల కారణంగా సుమారు 11,977 మంది మరణించినట్లు పేర్కొంది. కానీ హోం క్వారంటైన్‌లోనే ఉండి చనిపోయిన వారి సంఖ్యను వెల్లడించలేదు. ఆంక్షలు సడలించాక జనవరి12 నాటికి ఒక్క నెలరోజుల్లోనే దాదాపు 60 వేల మరణాలు సంభవించాయని ఒక వారం ముందు వెల్లడించింది. అంతేగాదు కోవిడ్‌ ఆంక్షలను ఎత్తేసిన డిసెంబర్‌ నుంచి అంతకు ముందు కలిపి మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షలకు పైగా ప్రజలు మరణించినట్లు తెలిపింది.

చైనాలో జరుపుకునే లూనార్‌ న్యూ ఈయర్‌ వేడుకలకు ముందుగానే సుమారు 36 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వేడుకలను పురస్కరించుకుని మిలియన్ల మంది ప్రజలు తమ సొంతగ్రామాలకు రావడంతో ఈ కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని భయాలు ఎక్కువయ్యాయి. ఐతే దేశంలో ఇప్పటికే 80 శాతం మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు, కాబట్టి  ఇప్పట్లో కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చే అవకాశం లేదని చైనా సీడీసీలోని చీఫ్‌ ఎపిడెమియాలజిస్ట్‌ వూ జున్‌ యూ అన్నారు. 

(చదవండి: కాలిఫోర్నియా: చైనీస్‌ న్యూఇయర్‌ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి)

మరిన్ని వార్తలు