అన్నంత పని చేసిన అమెరికా! కస్సు మంటున్న చైనా

25 Jun, 2022 12:03 IST|Sakshi

తైవాన్‌ జలసంధి గుండా ఇటీవల యూఎస్‌ మారిటైమ్‌ విమానం పయనించడంతో చైనా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అదీగాక తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇటీవలే అమెరికాకి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. పైగా ఇరు ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం ఏర్పడుతుందని హెచ్చరించింది కూడా. మరోవైపు తైవాన్‌ తమ ద్వీప సమీపంలోనే చైనా వైమానిక దళాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ పదే పదే ఫిర్యాదులు చేసింది.

దీంతో యూఎస్‌ కూడా తైవాన్‌ని ఇబ్బంది పెట్టవద్దని  చైనాకి సూచించింది.  తైవాన్‌ పట్ల ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకోనని... తైవాన్‌కి పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా మిలటరీ సాయాన్ని కూడా అందిస్తానని యూఎస్‌ తెగేసి చెపింది. ఈ మేరకు యూఎస్‌ తాను అన్నట్లుగానే మాటనిలబెట్టుకోవడమే గాక అన్నంత పనిచేసేసింది. దీంతో చైనా తీవ్రస్థాయిలో యూఎస్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందటూ కన్నెర్ర జేసింది.

శాంతికి భంగం కలిగించే చర్యలకు దిగుతుందంటూ అమెరికా పై ఆరోపణలు చేసింది చైనా . యూఎస్‌ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నొక్కి చెప్పింది. అంతేకాదు యూఎస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి తమ సైన్యం సదా అప్రమత్తంగానే ఉందని చైనా స్పష్టం చేసింది. ఈ మేరకు భూ, వాయు మార్గాల్లో చైనా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని,  చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండ్‌ ప్రతినిధి కల్నల్‌ షియి తెలిపారు. తైవాన్‌ని తన భూభాగంగానే భావిస్తున్న చైనాకి అమెరికా ఈ వ్యవహరంలో తలదూర్చడం మింగుడు పడని అంశంగా మారింది. ఐతే ఈ వ్యాఖ్యలపై అమెరికా నావికదళం ఇం‍కా స్పందించలేదు. 

(చదవండి: చైనాని శత్రువుగా చిత్రీకరించవద్దు! అమెరికా చారిత్రక తప్పిదం)

మరిన్ని వార్తలు