చైనాను కలవరపెడుతున్న కరోనా.. జిన్‌ పింగ్‌ సంచలన నిర్ణయం

4 Apr, 2022 11:11 IST|Sakshi

బీజింగ్: చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం చైనా సర్కార్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఇక, ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. అయితే, రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ట కేసులుగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, ఆదివారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా ఈశాన్య చైనాలోని బయో చెంగ్, షాంఘైలోనూ లాక్‌డైన్‌ విధించారు. అయితే, వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించలేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. కాగా, రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో భారీ స్థాయిలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర‍్ణయం తీసుకుంది. సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న 26 మిలియన్ల మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక్కడ టెస్టుల కోసం చైనా మిలిటరీని, వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలను షాంఘైకి పంపింది. ఇటీవల ఆర్మీ, నేవీ, జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్‌ల నుండి రిక్రూట్ అయిన 2,000 మందికి పైగా వైద్య సిబ్బందిని షాంఘైకి పంపినట్లు సాయుధ దళాల వార్తాపత్రిక నివేదించింది. దీంతో వీరందరూ షాంఘైలో ఉన్న ప్రజలకు టెస్టులు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు