తొలిసారిగా సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనున్న చైనా!

29 May, 2023 09:58 IST|Sakshi
అంతరక్ష యాత్రను పర్యవేక్షించనున్న నిపుణులు

చైనా తొలిసారిగా తమ దేశ సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ మేరకు టియాంగాంగ్‌ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్‌లో భాగంగా మంగళవారమే తన దేశ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుందని ఆ దేశ మానవ సహిత అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని బీచింగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ ప్రోఫెసర్‌, పేలోడ్‌ నిపుణుడు గుయ్‌ హైచావో, మానవ సహిత అంతరిక్ష సంస్థ ప్రతినిధి లిన్‌ జియాంగ్‌  వెల్లడించారు.

మంగళవారం ఉదయం 9.30 గంటలకు వాయువ్య చైనాలోని జియక్వాన్‌ శాటిలైట్‌ లాంచ్‌​ సెంటర్‌ నుంచి టేకాఫ్‌ కాబోతున్నాయని మానవ సహిత అంతరిక్ష సంస్థ తెలిపింది. అయితే ఈ మిషన్‌లో గుయ్ అంతరిక్ష శాస్త్ర ప్రయోగాత్మక పేలోడ్‌ల ఆన్-ఆర్బిట్ ఆపరేషన్‌కు ప్రధానంగా బాధ్యత వహించగా, మిషన్ కమాండర్ జింగ్ హైపెంగ్, క్రూ సిబ్బంది ఝు యాంగ్జు ఈ యాత్రని పర్యవేక్షిస్తారు. 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆధ్వర్యంలో అంతరిక్ష యాత్ర కల కోసం ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతేగాదు ప్రపంచంలో రెండోవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా తన మిలటరీ రన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.

ఎ‍ప్పటికైనా మానవులను చంద్రునిపైకి పంపాలనే లక్ష్యంతో ఉంది. ఈ విషయమై రష్యా, యూఎస్‌లో పోటీ పడేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగానే చైనా కూడా చంద్రునిపై స్థావరాన్ని నిర్మించాలని భావింస్తుంది. అంతేగాక 2029 నాటికి సిబ్బందితో కూడిన చంద్ర మిషన్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

(చదవండి: మహిళా కార్యకర్తలపై జరుగుతున్న అకృత్యాలపై దర్యాప్తు చేయాలి!: అత్యున్నత​ న్యాయస్థానాన్ని అభ్యర్థించిన ఇమ్రాన్‌ ఖాన్‌)
 

మరిన్ని వార్తలు