China Xian Lockdown: వుహాన్‌ను మించిన లాక్‌డౌన్‌.. చైనా తీరుపై సంభ్రమాశ్చర్యాలు

23 Dec, 2021 15:51 IST|Sakshi

China Impose Huge Lockdown In Xian: ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విజృంభణలో కరోనా పుట్టుక- వుహాన్‌ ల్యాబ్‌ థియరీ మరోసారి తెర మీదకు వచ్చింది. వైరస్‌ వెనుక డ్రాగన్‌ కంట్రీ హస్తమే ఉందన్న ఆరోపణను మరోసారి బలంగా లేవనెత్తుతోంది అమెరికా.  ఈ తరుణంలో చైనాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒమిక్రాన్‌ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోయినా.. భారీ లాక్‌డౌన్‌కు చైనా సిద్ధపడింది. 


కోటికి పైగా జనాభా ఉన్న చైనా వుహాన్‌ నగరాన్ని.. కరోనా వైరస్‌ పుట్టినిల్లుగా అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే వుహాన్‌లో గతంలో విధించిన లాక్‌డౌన్‌ను ప్రపంచమంతా భారీగా భావించించింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జనాభే ఉన్న నగరాన్ని లాక్‌డౌన్‌తో దిగ్భంధించింది చైనా ప్రభుత్వం.  పశ్చిమ చైనా నగరం జియాన్‌లో గురువారం నుంచి లాక్‌డౌన్‌ అమలు అవుతోంది.  మరికొన్ని నగరాలకు లాక్‌డౌన్‌ విధించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. కోటిన్నరకి పైగా జనాభా ఉన్న జియాన్‌లో అనవసరమైన ప్రయాణాల్ని నిషేధించారు. నిత్యావరసరాలకు ఒక్కరే బయటకు వెళ్లాలన్న నిబంధనను విధించారు. మరోవైపు డొమెస్టిక్‌ విమానాల్ని సైతం రద్దు చేసింది. కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు.

ఇప్పటివరకు తమ దేశంలో ఒక్క ఒమిక్రాన్‌ కేసు కూడా నమోదు కాలేదని చైనా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో చైనా లాక్‌డౌన్‌ ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు డెల్టా వేరియెంట్‌ కేసులు మాత్రం ఉన్నాయి. 14 జిల్లాల్లో 127 కేసులు బయటపడ్డాయి తాజాగా. అయితే ఇవేవీ స్థానికంగా వచ్చినవి కావని, బయటి నుంచి వచ్చినవాళ్లవేనని ప్రకటించుకుంది ప్రభుత్వం. ఈ తరుణంలో వైరస్‌ విజృంభణకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు చైనా మీడియా కథనాలు వెలువరుస్తోంది.


 
ఒమిక్రాన్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావంతో ఇమ్యూనిటీ ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉన్నందునే..  చైనీస్‌ వైస్‌ ప్రీమియర్‌ సన్‌ చున్లాన్‌ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. తద్వారా లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ తగ్గించే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం పని చేస్తోంది. ఇక సెలవుల ప్రయాణాలు, ఫిబ్రవరి నుంచి జరగబోయే వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలోనే కరోనా కేసుల్ని కట్టడి చేసే దిశగా చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. 

2021లో చైనాలో తొమ్మిది సార్లు కరోనా విజృంభించింది. అయితే అధికారిక లెక్కలు చెప్పడానికి చైనా ఇష్టపడడం లేదు. మొత్తంగా కరోనా మొదలైనప్పటికీ లక్షకి పైగా కేసులు, 4 వేల మరణాలు మాత్రమే ప్రకటించుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యాన్ని గురి చేసింది డ్రాగన్‌ కంట్రీ. అంతేకాదు కరోనా విజృంభణ తర్వాత  ‘జీరో’ కేసులుగా ప్రకటించుకున్న దేశాల్లో చైనా మొదటిది కావడం కొసమెరుపు.

చదవండి: ఒమిక్రాన్‌ విజృంభణ.. రాబోయే మూడు నెలలు గడ్డుకాలమేనా?

మరిన్ని వార్తలు