బీజింగ్: డ్రాగన్ దేశం చైనాను అఫ్గానిస్తాన్కు మిత్రదేశంగా పరిగణిస్తున్నామని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ వ్యాఖ్యానించారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్న ఉయ్గర్ ఇస్లామిక్ తీవ్రవాదులకు తాము ఎలాంటి సహకారం అందించబోమని స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి మళ్లడంతో అక్కడ మళ్లీ తాలిబన్ల పెత్తనం పెరుగుతోంది. దీంతో అఫ్గాన్లో 210 మంది తమ పౌరులను చైనా ప్రభుత్వం ఇటీవలే చార్టర్డ్ విమానంలో స్వదేశానికి తీసుకొచ్చింది.
అఫ్గానిస్తాన్లో తాలిబన్ల పెత్తనంపై చైనా సైతం ఆందోళన చెందుతోంది. తూర్పు తుర్కిస్తాన్ ఇస్లామిక్ ఉద్యమానికి ఇక అఫ్గాన్ కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఈ సంస్థ ప్రాబల్యం అధికం. జిన్జియాంగ్కు, అఫ్గానకు మధ్య 8 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. చైనా ఆందోళనను తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ కొట్టిపారేశారు.