బీజింగ్ : వయో భారం కారణంగా మృతి చెందిన తోడేలు స్థానంలో కాపలా కుక్కను ఉంచి జనాలను మోసం చేయటానికి చూసిందో జూ యజమాన్యం. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చైనా, హ్యూబే ప్రావిన్స్కు చెందిన క్సూ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం గ్జియాన్నింగ్లో ఉన్న గ్జియాంగ్వుషాన్ జూకి వెళ్లాడు. అక్కడి జంతువులను ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతున్నాడు. కొద్దిసేపటి తర్వాత తోడేలు అని రాసి ఉన్న చోట ఆగి ఎన్క్లోజర్లోకి చూశాడు. అయితే ఆ తోడేలు వీధి కుక్కలా ఉండటంతో మరింత పరీక్షగా చూసి, అది కుక్కేనని ధ్రువీకరించుకున్నాడు.
ఈ విషయమై జూ సిబ్బందిని నిలదీయగా.. ఒకప్పుడు ఆ ఎన్క్లోజర్లో తోడేలు ఉండేదని, వయో భారం కారణంగా అది మృతి చెందిందని తెలిపారు. ఎన్క్లోజర్ను ఖాళీగా ఉంచటం బాగోదని కొద్ది రోజుల పాటు కాపలా కుక్కను ఉంచుతున్నామని చెప్పారు. జూను సరిగా నడపటానికి కావాల్సినంత నిధులు రావటంలేదని, జనాలు కూడా తక్కువగా వస్తున్నారని అన్నారు. ఎన్క్లోజర్లో కుక్క ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ తోడేలేంటి వీధి కుక్కలా ఉంది?’’.. ‘‘ హ.హ..హ.. నువ్వు తోడేలువువా?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి : ఆ కొండంతా బంగారం.. ఎగబడ్డ జనం