హిందూ మహాసముద్రంలో పడిన చైనా రాకెట్ శకలాలు

9 May, 2021 10:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5-బీ రాకెట్‌ ముప్పు తప్పింది. వారం రోజులుగా ఎక్కడ పడుతుందా అని టెన్షన్‌ పెట్టిన చైనా రాకెట్‌ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. భూ వాతావరణంలోకి  రాగానే రాకెట్‌ శకలాలు అధికభాగం మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చి సముద్రంలో 18 టన్నుల శకలాలు పడిపోయాయి.

అవి పశ్చిమ మాల్దీవుల సమీపంలోని సముద్రంలో నేలకూలినట్లు నిర్ధారించారు. ఈ రాకెట్‌ శకలాలు సముద్రంలో కూలడం కంటే ముందే దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఏప్రిల్‌ 29న  చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ అనే భారీ రాకెట్‌ నియంత్రణ కోల్పోయింది. ఇక అప్పటి నుంచి ఎక్కడ పడతాయని అందరూ టెన్షన్‌ పడిన సంగతి తెలిసిందే.

అమెరికా మిలిటరీ మాత్రం..
ఈ రాకెట్‌ భూవాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలాలు పూర్తిగా బూడిద అయిపోతాయిని, జనావాసాలపై పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా మిలిటరీ మాత్రం.. ఆ శకలాలు తుర్కిమెనిస్తాన్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతాయిని చెప్పాయి. కానీ చివరికి హిందూ మహా సముద్రంలో ఆ రాకెట్‌​ శకలాలు పడిపోవటం గమనార్హం.

( చదవండి: చైనా కుతంత్రం: జీవాయుధంగా క‌రోనా )

మరిన్ని వార్తలు