ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు

18 Sep, 2021 08:46 IST|Sakshi

బీజింగ్‌: చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ పిండుయోడువో ఇంక్ వ్యవస్థాపకుడు కోలిన్ హువాంగ్ ఈ సంవత్సరం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంపదను కోల్పోయిన వ్యక్తిగా నిలిచాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం హువాంగ్ సంపద 27 బిలియన్ డాలర్లకు(19,85,72,31,00,000 రూపాయలు) పైగా పడిపోయింది. చైనా తన దేశంలోని ఇంటర్నెట్ దిగ్గజాలపై విరుచుకుపడడంతో కంపెనీ స్టాక్ ఇంత భారీగా పడిపోయింది. 

బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌లోని 500 మంది సభ్యులలో ఇది అతిపెద్ద క్షీణత కాగా కోలిన్‌ తర్వత అత్యధికంగా నష్టపోయిన తదుపరి వ్యక్తిగా చైనా ఎవర్‌గ్రాండే గ్రూప్ ఛైర్మన్ హుయ్ కా యాన్ నిలిచారు. ఈ చైనీస్‌ బిలయనీర్‌ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఈ ఏడాది సుమారు $ 16 బిలియన్ కంటే ఎక్కువ మొత్తంలో కోల్పోయి.. అప్పుల కుప్పతో పోరాడుతోంది.

దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్‌ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌  "సాధారణ శ్రేయస్సు" (కామన్‌ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవించాయి. జిన్‌పింగ్‌ తీసుకువచ్చిన నూతన విధానం ఫలితంగా పిండుయోడువో (పీడీడీ) షేర్లు ఈ సంవత్సరం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంటే ఎక్కువగా పడిపోయాయి. ఫలితంగా కోలిన్‌ భారీ నష్టాన్ని చవి చూశాడు. దీనిపై స్పందించేందుకు కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు. పిండుడువో అమెరికన్ డిపాజిటరీ రసీదులు ఈ సంవత్సరం 44 శాతం పడిపోయాయి. అలానే మరో దిగ్గజం ఆలీబాబా ఏడీఆర్‌ డిపాజిటరీ రసీదులు 33 శాతం క్షీణించగా... టెన్సెంట్ రసీదులు 20 శాతం పడిపోయాయి.

హువాంగ్‌ 2015లో పిండుయోడువో కంపెనీలో 28 శాతం వాటా కలిగి ఉన్నాడు. కమ్యూనిటీ కొనుగోలుకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా పిండుయోడువోని అనతి కాలంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజంగా మలిచాడు. పీడీడీ వార్షిక క్రియాశీల వినియోగదారులు డిసెంబరులో 788 మిలియన్లకు చేరుకున్నారు. ఇది ఆలీబాబా  ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్‌లలో 779 మిలియన్లను అధిగమించింది.

కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 125 బిలియన్ డాలర్లకు పడిపోయే ముందు గరిష్టంగా 178 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత నెలలో పబ్లిక్ కంపెనీగా మొదటి త్రైమాసిక నికర లాభాన్ని నివేదించింది. హువాంగ్, గత ఏడాది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన పదవికి రాజీనామా చేశారు. అలానే మార్చిలో మార్చిలో చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. 

చైనాలో ఆదాయ అంతరాన్ని తగ్గించేందుకు ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ తీసుకువచ్చిన దాతృత్వ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుత, భవిష్యత్తు కార్పొరేట్ లాభాలను తాకట్టు పెడుతున్న టెక్ దిగ్గజాలలో పీడీడీ ఒకటి. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి సహాయపడటానికి గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కేటాయిస్తామని పీడీడీ వెల్లడించింది. అంతకు ముందు, హువాంగ్, పీడీడీ వ్యవస్థాపక బృందం గత సంవత్సరం ఒక ఛారిటబుల్ ట్రస్ట్‌కు కంపెనీ వాటాలలో  2.4 బిలియన్‌ డాలర్లను కేటాయించారు.

బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఈ సంవత్సరం అతిపెద్ద నికర విలువ క్షీణత కలిగిన 10 మంది బిలియనీర్లలో ఆరుగురు చైనాకు చెందిన వారే ఉన్నారు. అంతేకాక అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఈ సంవత్సరం $ 6.9 బిలియన్ సంపదను కోల్పోయారు.

మరిన్ని వార్తలు