ప్లీనరీలో జిన్‌పింగ్‌ వర్క్‌ రిపోర్ట్‌

10 Oct, 2022 05:29 IST|Sakshi

16న చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయ సదస్సు   

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదివారం అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ప్లీనరీ నిర్వహించారు. తన పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్తు దార్శనికతపై ఒక వర్క్‌ రిపోర్ట్‌ను ఈ సందర్భంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. కొన్ని కీలక విధానాలు, డాక్యుమెంట్లపై చర్చించారు. ఈ నెల 16న జరగబోయే కమ్యూనిస్ట్‌ పార్టీ 20వ జాతీయ సదస్సుకు సన్నాహకంగా ఈ ప్లీనరీని నిర్వహించినట్లు తెలుస్తోంది.

జిన్‌పింగ్‌ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గత పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయ సదస్సును ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. చైనా అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో ఉండడానికి వీల్లేదు. కానీ, 2018లో రాజ్యాంగాన్ని సవరించారు. పదేళ్ల పదవీ కాలం నిబంధనను తొలగించారు. జిన్‌పింగ్‌ మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా పదవీలో ఉండడానికి వీలు కల్పించారు.

మరిన్ని వార్తలు