శ్రీలంక పోర్టుకు చైనా పరిశోధక నౌక.. స్పందించిన భారత్‌!

4 Aug, 2022 18:57 IST|Sakshi

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. కొలంబో సంక్షోభానికి చైనా కుట్రపూరిత రుణాలేనని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో మళ్లీ తన లీలలు మొదలు పెట్టింది చైనా. తన అధీనంలో ఉన్న శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హమ్‌బన్‌తోటా పోర్టుకు పరిశోధన, సర్వే నౌకను పంపిస్తోంది. అది ఆగస్టు 11న శ్రీలంక నౌకాశ్రయానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో స్పందించింది భారత్‌. పరిస్థితులను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

చైనా నౌక సోమవారం పోర్టుకు వచ్చే అంశంపై కేబినెట్‌ చర్చించినట్లు శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బందులా గుణవర్ధెన పేర్కొన్నారు. ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్‌, చైనాలు మాకు సాయం అందించాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. చైనా వల్లే దేశంలో పరిస్థితులు దిగజారాయనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నిరసన క్యాంపులను ఖాళీ చేసేందుకు ససేమిరా.. 
శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్ష భవనం సమీపంలోని గాలే ఫేస్‌ నిరసన క్యాంప్‌ను శుక్రవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే.. వాటిని తిరస్కరించారు నిరసనకారులు. నిరసనలు కొనసాగుతాయని, క్యాంపులను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఖాళీ చేయించేందుకు పోలీసుల వద్ద కోర్టు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ ప్రాంతాన్ని నిరసనలు చేసుకునేందుకు అనుమతించారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: Raghuram Rajan: అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు

>
మరిన్ని వార్తలు