కాలుష్యంపై వింత నిరసన.. రూ.900 కోట్ల పెయింటింగ్‌పై పొటాటో సాస్‌ పోసి..!

24 Oct, 2022 17:21 IST|Sakshi

బెర్లిన్‌: పర్యావరణ కాలుష్యంపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇద్దరు పర్యావరణ వేత్తలు సాహాసానికి పూనుకున్నారు. సుమారు రూ.900 కోట్లుకుపైగా విలువైన మోనెట్‌ పెయింటింగ్‌పై ఆలు, టమాటో సాస్‌ పోసి నిరసన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధనాలను భూమి నుంచి తీసి వాడటానికి వ్యతిరేకంగా ఇలా చేసినట్లు చెప్పారు. ఈ సంఘటన జర్మనీలో జరిగింది. ఈ వీడియోను లాస్ట్‌ జనరేషన్‌ అనే ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. 

లాస్ట్‌ జనరేషన్‌ గ్రూప్‌కు చెందిన ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు బార్బెరిని మ్యూజియంలో మోనెట్‌ లెస్‌ మెయూల్స్‌ పెయింటింగ్‌పై పొటాటో సాసు పోశారు. అనంతరం పెయింటింగ్‌ వద్ద కూర్చుని నిరసన తెలిపారు. ‘మీరు సమస్య వినడానికి ఈ పెయింటింగ్‌పై పొటాటో సాసు వేయటం ఉపయోగపడుతుందా? మనం ఆహారం కోసం గొడవపడాల్సి వస్తే.. ఈ పెయింట్‌కు విలువే ఉండదు. ప్రజలు చనిపోతున్నారు. మనం పర్యావరణ విపత్తులో ఉన్నాం. పెయింటింగ్‌పై టమాటో సూప్‌ పోయటం వల్ల భయపడుతున్నారు. కానీ మేము ఎందుకు భయపడుతున్నామో మీకు తెలుసా? 2050 నాటికి మనకు తినడానికి తిండి దొరకదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకు భయపడుతున్నాం. మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడే ఇదంతా ఆగిపోతుంది.’ అని పేర్కొన్నారు.

ఈ స్టంట్‌లో నలుగురు పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. పెయింటింగ్‌ మొత్తం గ్లాస్‌తో ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బర్బెరిని మ్యూజియమ్‌ తెలిపింది. ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు మ్యూజియం డైరెక్టర్‌ ఓర్ట్రూడ్‌ వెస్తేయిడర్‌ పేర్కొన్నారు. పర్యావరణ విపత్తుపై వారి ఆందోళనలను అర్థం చేసుకున్నామని, అయితే, వారి డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించిన విధానమే ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదు.

ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్‌.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు!

మరిన్ని వార్తలు