Gotabaya Rajapaksa: సింగపూర్‌లో ‘గొటబయ’కు ఊహించని షాక్‌.. క్రిమినల్‌ కేసు నమోదు!

25 Jul, 2022 13:39 IST|Sakshi

సింగపూర్‌: శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రజాగ్రహంతో దేశం విడిచిన గొటబయ రాజపక్స ప్రస్తుతం సింగపూర్‌లో తలదాచుకుంటున్నారు. అయితే.. అక్కడా ఊహించని షాక్‌ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రజాహక్కుల గ్రూప్‌ గొటబయపై క్రిమినల్‌ కేసు పెట్టింది. యుద్ధ నేరాల ఆరోపణలతో గొటబయను అరెస్ట్‌ చేయాలంటూ.. సింగపూర్‌ అటార్నీ జెనరల్‌కు 63 పేజీల ఫిర్యాదును అందజేశారు ఇంటర్నేషనల్‌ ట్రూత్‌ అండ్‌ జస్టిస్‌ ప్రాజెక్ట్‌(ఐటీజేపీ) న్యాయవాదులు. 2009లో జరిగిన అంతర్యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న రాజపక్సే.. జెనీవా ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవి అంతర్జాతీయ న్యాయపరిధిలో భాగంగా సింగపూర్‌ దేశీయ ప్రాసిక్యూషన్‌కు లోబడిన నేరాలుగా పేర్కొన్నారు. 

పిటిషన్‌ ప్రకారం.. అంతర్యుద్ధం సమయంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టం, అంతర్జాతీయ క్రిమినల్‌ చట్టాలను గొటబయ ఉల్లంఘించారు.‘అందులో హత్య, ఉరి తీయించటం, వేధించటం, అమానవీయంగా కొట్టటం, అత్యాచంర, ఇతర లైంగిక వేధింపులు, స్వేచ్ఛను హరించటం, మానసికంగా క్షోభకు గురిచేయంట వంటివి ఉన్నాయి. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వం పతనాన్ని చూసింది, అయితే శ్రీలంకలో సంక్షోభం నిజంగా మూడు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్రితం జరిగిన తీవ్రమైన అంతర్జాతీయ నేరాలతో ముడిపడి ఉంది. ఈ ఫిర్యాదు కేవలం అవినీతి, ఆర్థిక అవకతవకల గురించే కాదు.. తీవ్ర నేరాలకు బాధ్యత వహించాలని నమోదు చేశాం.’ అని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యోస్మిన్‌ సూకా పేర్కొన్నారు.

గొటబయ రాజపక్సను అరెస్ట్‌ చేసి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని కోరింది ఐటీజేపీ. 1989లో ఆయన ఆర్మీ కమాండర్‌గా ఉన్నప్పుడు.. సుమారు 700 మంది కనిపించకుండా పోయారని ఆరోపించింది. ముఖ్యంగా రక్షణ శాఖ సెక్రెటెరీగా ఉన్నప్పుడు ఆ నేరాలు మరింత పెరిగాయని తెలిపింది. తన కింది అధికారులకు టెలిఫోన్‌ ద్వారా నేరుగా ఆదేశాలు ఇచ్చి ప్రజలపై దాడి చేయించే వారని ఆరోపించింది.

ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు.. వీడియో వైరల్‌!

మరిన్ని వార్తలు