మరణమృదంగం.. చలికాలంలో మూడు కరోనా వేవ్‌లు?

21 Dec, 2022 03:36 IST|Sakshi
జియాంగ్సు ప్రావిన్స్‌లో ఫార్మసీ ముందు క్యూ కట్టిన స్థానికులు

కిలోమీటర్ల కొద్దీ రోగుల లైన్లు 

3 నెలల్లో 60% మందికి సోకవచ్చు 

ఆందోళన కలిగిస్తున్న అంచనాలు 

చైనాలో కోవిడ్‌–19 విశ్వరూపం చూపిస్తోంది. ప్రజా నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని వెనక్కి తీసుకున్న దగ్గర్నుంచి కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. మందులు దొరకడం లేదు. కరోనా రోగులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని చికిత్స కోసం ఆస్పత్రుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిల్చొంటున్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.

ఆస్పత్రుల కారిడార్లలో, మార్చురీలలో శవాలు వరసగా పెట్టి ఉన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. శ్మశాన వాటికల్లో రోజూ వందలాది మృతదేహాలు వస్తున్నాయి. రోజుకి దాదాపుగా 40 వేల మందికి కరోనా సోకుతున్నట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పైగా చలికాలం ముగిసేలోగా కనీసం మూడు వేవ్‌లు దేశాన్ని అతలాకుతలం చేస్తాయంటూ వెలువడుతున్న అంచనాలు ఆందోళనను మరింత పెంచుతున్నాయి.

ఇంతటి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం కేసుల సంఖ్యని తక్కువ చేసి చూపిస్తోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నా మంగళవారం కేవలం ఐదుగురే ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించింది. కోవిడ్‌తో శ్వాసకోశ సమస్యలతో చనిపోతేనే కరోనా మరణాలుగా లెక్కిస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఒమిక్రాన్‌లో త్వరితంగా వ్యాప్తి చెందే బిఏ.5.2, బిఎఫ్‌.7 సబ్‌ వేరియంట్లు విస్తరిస్తున్నాయి. రోగుల తాకిడిని ఎదుర్కోవడానికి బీజింగ్, షాంఘై, చెంగ్డు, వెన్‌ఝూ సహా పలు నగరాల్లో వందల పడకలున్న తాత్కాలిక ఆస్పత్రులు, వందలాది ఫీవర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఎక్కువ గంటలు పని చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. 

రాబోయేవి గడ్డు రోజులు  
చైనాలో ఇక మీద గడ్డు రోజులు ఎదుర్కోబోతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే మూడు నెలల్లో చైనా జనాభాలో 60శాతానికి పైగా కరోనా బారిన పడతారని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంతర్జాతీయ వ్యాధి నిపుణుడు ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌ అంచనా వేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని వచ్చే ఏడాది చైనాలో రోజుకి లక్ష కేసులు నమోదవుతాయని, 20 లక్షల మంది మరణిస్తారని పలు నివేదికలు హెచ్చరించాయి.

వృద్ధుల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడంలో చూపించిన నిర్లక్ష్యానికి చైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నాయి. కరోనాలో అత్యంత కీలకమైన ఆర్‌ వాల్యూ (ఒక వ్యక్తి నుంచి వైరస్‌ ఎంతమందికి సంక్రమిస్తుందో చెప్పే విధానం) 16గా ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అంటే ఒక వ్యక్తి ద్వారా వైరస్‌ 16 మందికి సోకుతుందన్న మాట.

2019లో వూహాన్‌లో కరోనా బట్టబయలయ్యాక ఇంతటి ఘోరమైన పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారి. జిన్‌పింగ్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కరోనాతో ఈ మూడేళ్లలో 3.80 లక్షల కేసులు నమోదైతే, 5,242 మంది ప్రాణాలు కోల్పోయారు. వరల్డ్‌ డేటా మాత్రం ఇప్పటివరకు 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని,  గత 24 గంటల్లో 40వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెబుతోంది.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

ఆర్థికంగా కుదేల్‌.. 
కరోనా ప్రభావం చైనాను ఆర్థికంగానూ దెబ్బ తీసేలా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 3% వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనాలున్నాయి. గత 50 ఏళ్ల కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ పనితీరు ఈ ఏడాదే అధ్వాన్నంగా మారింది. పనిచేసేవారంతా కరోనా వైరస్‌తో పడకెక్కడంతో అన్ని రంగాల ఉత్పత్తి దారుణంగా పడి పోయింది. జనవరి 2013 తర్వాత ఇప్పుడు డిసెంబర్‌లో చైనాలో అతి తక్కువ వాణిజ్య కార్యకలాపాలు నమోదయ్యాయి. చైనా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఆ దేశంలో వాణిజ్యం సక్రమంగా సాగకపోతే దాని ప్రభావం ప్రపంచదేశాలపై పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఎందుకీ పరిస్థితి?  
► చైనా ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానంతో కఠినమైన నిబంధనలు విధించి లక్షణాలు లేని వారిని క్వారంటైన్‌ చేయడం, మూకుమ్మడి పరీక్షలు, రోగులతో కాంటాక్టయిన వారిని నాలుగ్గోడల మధ్య ఉంచడం వంటివి చేయడంతో ఇన్నాళ్లూ కేసులు వెలుగులోకి రాలేదు. నెలల తరబడి లాక్‌డౌన్‌లు, గదుల్లో తాళాలు వేసే కఠినమైన క్వారంటైన్‌ నిబంధనలపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జీరో కోవిడ్‌ విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 7న వెనక్కి తీసుకుంది. 

చైనాలో ఓ ఆస్పత్రి మార్చురీలో శవాలు 

► ఇన్నాళ్లూ కరోనా వైరస్‌ ఎక్కువ మందికి సోకకపోవడంతో వైరస్‌ను ఎదుర్కొనే సహజసిద్ధమైన ఇమ్యూనిటీ చైనాలో చాలామందికి రాలేదు. ఆంక్షలు పూర్తిగా ఎత్తేయడంతో ఒక్కసారిగా కేసులు భారీగా పెరిగిపోయాయి. 

► చైనా తాను సొంతంగా తయారు చేసిన సినోవాక్, సోనిఫార్మ్‌ వ్యాక్సిన్లనే వాడింది. 350 కోట్ల డోసుల్ని పంపిణీ చేసింది. వీటి సామర్థ్యంపై సవాలక్ష సందేహాలున్నాయి. పైగా 80 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. ఇప్పుడు వాళ్లే వైరస్‌ క్యారియర్లుగా మారారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

► కరోనా వైరస్‌ మానవ నిర్మితమేనని పలు నివేదికలు నిర్ధారించడంతో దీని వ్యాప్తి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు చైనాలో మరో వేవ్‌ మొదలైందని, దీని వల్ల పలు కొత్త వేరియెంట్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని సింగపూర్‌ యూనివర్సిటీలో వైస్‌ డీన్‌ అలెక్స్‌ కుక్‌ అంచనా వేస్తున్నారు. చైనాలో పరిస్థితి ఇతర దేశాలకు ప్రమాదకరమేనని ఆయన హెచ్చరించారు.   

కేంద్రం అప్రమత్తం  
వైరస్‌ నమూనాలు జన్యు విశ్లేషణకు పంపండి
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ

న్యూఢిల్లీ: చైనా, జపాన్, దక్షిణకొరియా, బ్రెజిల్, అమెరికా సహా  ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కొత్త వేరియెంట్లను వెనువెంటనే గుర్తించడం కోసం వైరస్‌ నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం లేఖ రాశారు.

కరోనాను ఎదుర్కోవాలంటే కొత్త వేరియెంట్లను సకాలంలో గుర్తించాలని, అందుకే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వైరస్‌ నమూనాలను ప్రతీ రోజూ తప్పనిసరిగా జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల కోసం పంపించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్‌లో వారానికి 1200  కేసులు వస్తూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల కేసులు వస్తున్నాయని వెల్లడించారు. కొత్త వేరియెంట్లను గుర్తించి  ఎదుర్కోవడానికి ఐదంచెల వ్యూహం అమలుపై దృష్టి పెట్టాలన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్‌ విధానంతో పాటు వ్యాక్సిన్,  నిబంధనల్ని తప్పనిసరిగా పాటించడం  చేయాలన్నారు.

మరిన్ని వార్తలు