కరోనా ఉంటే ఫ్రీడమ్‌ పాస్‌లు ఇస్తారట!

11 Nov, 2020 19:25 IST|Sakshi

బ్రిటన్‌ ప్రభుత్వం సరికొత్త పద్ధతి

క్వారంటైన్‌ పూర్తయ్యాక ‘ఫ్రీడమ్‌ పాస్‌’

లండన్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్‌ పూర్తయ్యాక ‘ఫ్రీడమ్‌ పాస్‌’ ఇస్తామని చెప్పింది. ఈ పాస్‌లు మూడు నెలల పాటు చెల్లుతాయని, ఈ పాస్‌లతోని బ్రిటిష్‌ పౌరులు తమ ఇష్టానుసారం ఏమైనా చేసుకోవచ్చని కరోనా వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సర్‌ జాన్‌ బెల్‌ తెలిపారు.

కరోనా పరీక్షల్లో లేదని తేలిన వారికి వెంటనే స్వేచ్ఛను ప్రసాదిస్తామని, వారు తమ ఇష్టానుసారం ఎక్కడైనా తిరగొచ్చు, తమ ఇష్టమైనది చేయవచ్చని జాన్‌ బెల్‌ చెప్పారు. అయితే నెగెటివ్‌ వచ్చిన వారు కూడా అనుమానాలు వచ్చినప్పుడల్లా తరచుగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రాకపోయినట్లయితే ‘లివర్‌పూల్‌’లో లాగా నిర్బంధంగా పరీక్షలు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

చదవండి: ‘ఫైజర్‌’ వ్యాక్సిన్‌ భారత్‌కు వస్తుందా!?

మరిన్ని వార్తలు