కరోనా వైరస్‌ పుట్టుకపై మరో షాకింగ్‌ కోణం..

18 Mar, 2023 04:25 IST|Sakshi

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ సంక్రమించిందని భావిస్తూ ఉంటే కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం శునకాల నుంచి వచ్చిందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు చెప్పారు. చైనాలోని వూహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌లో సేకరించిన జన్యు నమూనాలను అధ్యయనం చేస్తే వూహాన్‌ మార్కెట్‌లో అమ్ముతున్న రకూన్‌ డాగ్స్‌ నుంచే వైరస్‌ వ్యాప్తి చెందిందని తేల్చారు.

ఈ కొత్త విశ్లేషణను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. జనవరి 2020లో కొందరు శాస్త్రవేత్తలు వూహాన్‌ మార్కెట్‌లో శాంపిల్స్‌ సేకరించారు. అప్పటికే కొత్త వైరస్‌ ఆందోళనతో వూహాన్‌ మార్కెట్‌ అంతా ఖాళీ చేయించారు. ఆ మార్కెట్‌ గోడలపైన, నేలపైన, జంతువుల్ని ఉంచే పంజరాల్లోనూ జన్యు నమూనాలు సేకరించి అధ్యయనం చేశారు. ఆ నమూనాల్లో అత్యధిక భాగం రకూన్‌ డాగ్స్‌తో సరిపోలాయని శాస్త్రవేత్తల బృందం తేల్చింది.

ఈ వివరాలను చైనా శాస్త్రవేత్తలతోనూ వారు పంచుకున్నారు. అయితే ఆ తర్వాత గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్‌ఏఐడీ) నుంచి ఈ డేటా మాయం అయిపోయిందని ఆ శాస్త్రవేత్తలు చెప్పారు. అరిజోనా యూనివర్సిటీ, కాలిఫోర్నియాలో స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, సిడ్నీ యూనివర్సిటీ వైరాలజిస్టులు ఈ బృందంలో ఉన్నారు. రకూన్‌ డాగ్స్‌ నుంచే  మనుషులకి సంక్రమించిందా లేదా అన్నది శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పలేకపోయారు. శునకాల నుంచి మనుషులకే నేరుగా సోకొచ్చు లేదా ఆ డాగ్స్‌ నుంచి వేరే జంతువుకి వెళ్లి మనుషులకి సోకి ఉండొచ్చని అన్నారు. 
 

మరిన్ని వార్తలు