కరోనా ఉన్నా.. మీడియా టీంతో ఇమ్రాన్‌ భేటీ

27 Mar, 2021 05:49 IST|Sakshi

ఇస్లామాబాద్‌: కరోనా వైరస్‌ బారిన పడిన తరువాత కూడా తన మీడియా టీమ్‌తో వ్యక్తిగతంగా సమావేశం నిర్వహించిన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్‌కు కరోనా సోకినట్లుగా గత శనివారం నిర్ధారణ అయింది. కొన్ని రోజుల ముందే ఇమ్రాన్‌ చైనాకు చెందిన సైనోఫార్మ్‌ టీకాను తీసుకున్నారు. కరోనా సోకిన తరువాత క్వారంటైన్‌లో ఉండకుండా, సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.

కరోనా నిబంధనలను ప్రధానే ఉల్లంఘించడం దారుణ మన్నారు. దేశంలో థర్డ్‌ వేవ్‌ నడుస్తున్న సమయ ంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధాని, ఆయనతో సమావేశంలో పాల్గొన్న మీడియా టీమ్‌పై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సంబంధిత సమావేశ వీడియోను సమాచార ప్రసార మంత్రి షిబ్లి ఫరాజ్, ఎంపీ ఫైజల్‌ జావేద్‌లే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం విశేషం. ట్రాక్‌ సూట్‌లో ఉన్న ఇమ్రాన్‌ కొద్ది దూరంలో కూర్చుని ఉన్న ఫరాజ్, జావేద్‌లతో పాటు తన మీడియా టీమ్‌తో మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
(చదవండి: భారత్‌–బంగ్లా బంధాన్ని విడగొట్టలేరు)

>
మరిన్ని వార్తలు