రూ.4 లక్షలు టిప్‌ ఇచ్చిన కస్టమర్‌..!

21 Dec, 2020 12:33 IST|Sakshi

వాషింగ్టన్‌: పండుగల వేళ మనకున్నదాంట్లో పేదవారికి సాయం చేస్తే.. వారి ముఖాల్లో కూడా సంతోషం వెల్లివిరిస్తుంది. అందుకే చాలా వరకు పండుగ పూట ఇంటికి వచ్చిన వారికి తోచినంత దానం చేస్తారు. అమెరికాకు చెందిన ఓ కస్టమర్‌ కూడా ఇలానే భావించాడు. తాను భోజనం చేయడానికి వెళ్లిన రెస్టారెంట్‌ స్టాఫ్‌కి 4 లక్షల రూపాయలు టిప్ ఇచ్చి.. అందరిని సమంగా పంచుకోమన్నాడు. అతడి దాతృత్వానికి రెస్టారెంట్‌ సిబ్బంది తెగ సంబరపడ్డారు. ధన్యవాదాలు తెలిపారు. వివరాలు.. ఈ నెల 12న ఓ కస్టమర్‌ ఒహియోలోని సౌక్‌ మెడిటేరియన్‌ రెస్టారెంట్‌కి వెళ్లాడు. డిన్నర్‌ చేశాడు. ఇక బిల్‌ తెచ్చివ్వగా.. బిల్తో పాటు 5,600 డాలర్లు (4,12,459 రూపాయలు) టిప్‌ ఇచ్చాడు. స్టాఫ్‌ అందరిని సమానంగా పంచుకోమని కోరాడు. మొత్తం 28 మందికి 200 డాలర్లు వచ్చాయి. ఇక క్రిస్టమస్‌ ముందు ఇంత భారీ మొత్తం టిప్‌గా లభించడంతో సిబ్బంది సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సదరు కస్టమర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. (వైర‌ల్‌: డెలివ‌రీ బాయ్‌కు ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌)

ఈ సందర్భంగా చీఫ్‌ కుక్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది మా అందరి జీవితాల్లో కన్నీళ్లే ఉన్నాయి. పండుగ ఆనందం కూడా లేదు. ఆర్థికంగా ఎంతో కుంగిపోయాం. కేవలం రోజులు గడుస్తున్నాయి అంతే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అపరిచితుడు మమ్మల్ని తన కుటుంబ సభ్యులుగా భావించాడు. మా అందరికి భారీ మొత్తం టిప్‌గా ఇచ్చాడు. ఇది మాకు ఎంతో ఎక్కువ. అతడికి జీవితాంతం కృతజ్ఞతలు తెలుపుతాం’ అన్నారు. ఇక ఇంత మంచి పని చేసిన వ్యక్తి తన పేరు బయటకు వెల్లడించవద్దని కోరినట్లు సిబ్బంది తెలిపారు. 

మరిన్ని వార్తలు