భారత్‌పై దావూద్‌ ఇబ్రహీం మళ్లీ గురి

20 Feb, 2022 06:10 IST|Sakshi

దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో భీకర దాడులకు ప్రణాళిక

ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడి

న్యూఢిల్లీ: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మళ్లీ భారత్‌పై గురిపెట్టాడా? ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడా? ఈ ప్రశ్నలకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అవుననే సమాధానం చెబుతోంది. భారత్‌లో భీకర దాడులతో అల్లకల్లోలం సృష్టించేందుకు దావూద్‌ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్‌ఐఏ బహిర్గతం చేయడం సంచలనాత్మకంగా మారింది. ‘ఇండియాటుడే’ కథనం ప్రకారం.. దావూద్‌పై ఎన్‌ఐఏ ఇటీవల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో విరుచుకుపడేందుకు దావూద్‌ ముఠా ప్రణాళిక రూపొందించిందని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది. ఢిల్లీ, ముంబై నగరాలపై దావూద్‌ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఎన్‌ఐఆర్‌ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో దావూద్‌ ఇబ్రహీంతోపాటు అతడి అనుచరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇటీవలే మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు