అందరి జీవితాల్లో వెలుగు నింపాలి : ట్రంప్‌

15 Nov, 2020 11:43 IST|Sakshi

వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

స్వయంగా దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌

వాషింగ్టన్‌ : దీపావళి వేడుకలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘనంగా జరుపుకున్నారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో ట్రంప్‌ సతీసమేతంగా పాల్గొన్నారు. అధికారులతో కలిసి దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైట్ హౌస్ సిబ్బందితోపాటు పలువురు భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా చాలా నమ్మకమైన దేశమని, ప్రతిఒక్కరు అమెరికన్‌ రాజ్యాంగబద్దంగా స్వేచ్ఛగా జీవించేలా తన పాలన కొనసాగినందుకు గర్విస్తున్నానని తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటామని గుర్తుచేశారు. దీపావళి కాంతుల్లా.. అమెరికా ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని, ప్రజలంతా మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షించారు. 
(చదవండి : తుది ఫలితాలు వెల్లడి.. వెనక్కి తగ్గిన ట్రంప్‌)

కాగా, దీపావళి పండుగను పురస్కరించుకుని భారతీయులకు ప్రపంచ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా త‌దుప‌రి అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. కొత్త ‌సంవ‌త్స‌రంలో అంద‌రి జీవితాల్లో ఆనందం, శ్రేయ‌స్సు నిండి ఉండాల‌ని ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు