ట్రంప్‌ సోషల్‌ మీడియా రీ ఎంట్రీ.. ఇదెలా సాధ్యం

22 Mar, 2021 11:56 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదేంటి‌, ఫేస్‌బుక్‌, ట్విటర్ సహా ఇతర సోషల్‌ మీడియాలో ఆయన ఖాతాలను నిషేధించారు కదా ! మరి ఎలా వస్తారని అనుకుంటున్నారా. తానే స్వయంగా ఓ కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించి దాని ద్వారా నెటిజన్ల ముందుకు రానున్నట్లు సమాచారం. అందుకే అంటారు ట్రంప్‌ రూటే సెపరేటని.

రెండు, మూడు నెలల్లో తన నూతన వేదికను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన సీనియర్‌ సలహాదారుల్లో ఒకరు ఓ ఆంగ్ల మీడియాతో వెల్లడించారు. ‘ట్రంప్‌ మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టనున్నారు. ఈ సారి ఆయన తన సొంత సామాజిక మాధ్యమ వేదిక పైన ప్రజలకు అందుబాటులోకి రానున్నారు’ అని  జేసన్‌ మిల్లర్‌ మీడియాకు తెలిపారు. ఇతను 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. కాకపోతే, ఈ అంశానికి సంబంధించిన ఎటువంటి అదనపు వివరాలను మిల్లర్‌ వెల్లడించలేదు.

మరోవైపు ట్రంప్‌ అధికార వర్గాల నుంచి కూడా దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అమెరికాలో జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తదనంతర  పరిణామాల కారణంగా  ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర వేదికలు ట్రంప్‌ ఖాతాను నిషేదించాయి.   ( చదవండి: ట్రంప్‌ బుద్ద.. ఎంతైనా చైనోడి తెలివే వేరబ్బా! )

మరిన్ని వార్తలు