టిక్‌టాక్‌కు అమెరికా చెక్‌

8 Aug, 2020 03:20 IST|Sakshi

వాషింగ్టన్‌: చైనా సోషల్‌ మీడియా యాప్‌లపై భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే. అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం పొంచివుందన్న కారణంగా తాజాగా అమెరికాలో సైతం టిక్‌టాక్, వుయ్‌ చాట్‌ యాప్‌లపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమలులోకి రానుంది. భారత్‌ ఇటీవలే టిక్‌టాక్, వీచాట్‌లతో పాటు చైనాకు సంబంధించిన 106 యాప్‌లపై నిషేధం విధించింది. దీన్ని అమెరికా చట్టసభ సభ్యులు, అధికార వర్గాలు స్వాగతించాయి. అమెరికాలో సైతం ఆ యాప్‌లను నిషేధించాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా జాతీయ భద్రతను కాపాడటానికి టిక్‌టాక్, వుయ్‌ చాట్‌ యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చైనాకు యాప్స్‌ నుంచి అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థలకు ముప్పు పొంచివున్నదని, కాంగ్రెస్‌కి ఇచ్చిన వివరణలో ట్రంప్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని మైక్రోసాఫ్‌ కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది.

భారత్, చైనాలకు వెళ్లకండి: కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భారత్, చైనా తదితర 50 దేశాలకు వెళ్లరాదని అమెరికా ప్రభుత్వం తన పౌరులను కోరింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో మార్చిలో జారీ చేసిన ప్రపంచ ఆరోగ్య ప్రయాణ మార్గదర్శకాలను ఎత్తివేసి, దాని స్థానంలో దేశాల వారీ ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది. ‘కోవిడ్‌–19 తీవ్రంగా ఉన్న దృష్ట్యా భారత్‌కు వెళ్లవద్దు. ఉగ్రవాదం, నేరాలు ఎక్కువగా ఉన్నందున అక్కడ మరింత జాగ్రత్త అవసరం’అని విదేశాంగ శాఖ ప్రయాణ సూచనల్లో పేర్కొంది. భారత్‌కు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలంటూ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ విభాగం నోటీసులు జారీ చేసింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చాలా దేశాలు అమెరికా ప్రయాణికులపైనా ఆంక్షలు కొనసాగిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు