రెండు కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ వెనుకంజ

11 Aug, 2020 05:11 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండు కీలక రాష్ట్రాల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దాదాపు 6 పర్సంటేజ్‌ పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. తాజాగా సీబీఎస్‌ న్యూస్‌ నిర్వహించిన ఒక ఒపీనియన్‌ పోల్‌లో ట్రంప్‌ను కలవరపరిచే ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌ ఈ రెండు రాష్ట్రాల్లో మంచి మెజారిటీ సాధించడం గమనార్హం.

కరోనాను అరికట్టే విషయంలో ట్రంప్‌ విఫలమయ్యారని, ఈ విషయంలో బైడెన్‌ సమర్ధవంతంగా వ్యవహరించేవాడని ఈ రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. సీబీఎస్‌ న్యూస్‌ తరఫున బ్రిటన్‌ సంస్థ ‘యుగవ్‌’ ఈ సర్వే జరిపింది.  ‘ఆర్థిక రంగానికి సంబంధించి ప్రజాభిప్రాయం ట్రంప్‌కే అనుకూలంగా ఉంటుంది.  కరోనా  విషయంలో విఫలమవ్వడం ఆ ఆధిపత్యాన్ని దెబ్బతీసింది’ అని సీబీఎస్‌ విశ్లేషించింది. బైడెన్‌కు ప్రస్తుతం  ఆధిక్యం ఉన్నా.. అది మారవచ్చని పేర్కొంది. 

మరిన్ని వార్తలు