అప్పుడే వైట్‌హౌస్‌ను వీడతాను : ట్రంప్‌

27 Nov, 2020 10:25 IST|Sakshi

ఓటమిని అంగీకరించడం చాలా కష్టంగా ఉంది : ట్రంప్‌

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పడి వేగంగా అడుగులు పడుతున్నా.. తన ఓటమిని మాత్రం డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించడంలేదు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగిందంటూ పాత పాటనే వినిపిస్తున్నారు. దేశంలోని 99శాతం మంది ప్రజలను తన ఓటమని అంగీకరించడంలేదని ప్రజల తీర్పునకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బైడెన్‌ మాత్రం రాబోయే తన ప్రభుత్వంలో కీలక విభాగాలకు అధిపతులను నియమిస్తున్నారు. అమెరికాను అభివృద్ధి వైపు నడిపిస్తానంటూ తన టీమ్‌ను సిద్ధ చేసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్‌ను ఎంచున్నారు. (వైట్‌హౌజ్‌ను వీడిన తర్వాతే.. ఎందుకంటే!)

మరోవైపు జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు బైడెన్‌ సిద్ధమవ్వగా.. ట్రంప్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘ఎన్నికల ఫలితాలపై నాకు ఇంకా నమ్మకముంది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగింది. 2020 యూఎస్‌ ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. ఈ ఎన్నికల్లో నేనే విజయం సాధించాను. దేశంలో ఓ వర్గం మీడియా నాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. ట్విటర్‌ కూడా నాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ట్రెండింగ్‌లో లేని విషయాన్ని కూడా ఉన్నట్లు చూపుతోంది. అసలు ట్రెండైయ్యే అంశాన్ని మాత్రం పట్టించుకోదు. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ ఖాళీ చేస్తా’అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 8 కోట్లపై చిలుకు ఓట్లతో గెలిచిన తొలి ప్రెసిడెన్షియల్‌ క్యాండిడేట్‌గా జోబైడెన్‌ చరిత్ర సృష్టించారు. కౌంటింగ్‌ కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా. మంగళవారానికి బైడెన్‌కు 8కోట్ల 11వేల ఓట్లు రాగా, ట్రంప్‌నకు 7.38 కోట్ల ఓట్లు వచ్చాయి. కౌంటింగ్‌ ప్రక్రియ మరికొన్ని రోజల పాటు కొనసాగనుంది.
 

మరిన్ని వార్తలు