మద్యం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ ఓ షరతు!

17 Jul, 2022 19:17 IST|Sakshi

లండన్‌: ఆల్కాహాల్‌ తీసుకోవటం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని వైద్యులు చెబుతుంటారు. తాగి ఇంటికొస్తే పెద్దలు తిడతారు. అయితే.. మద్యం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉన్నాయని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ‍్యయనం తేల్చింది. అవునండి అది నిజమేనటా? లిక్కర్‌ తాగితే చాలా రోగాలు దరిచేరవటా! కానీ, దానికో షరతు ఉంది. మీరు 40 ఏళ్ల వయసు దాటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే.. చిన్న గ్లాస్‌ రెడ్‌ వైన్‌, బీరు బాటిల్‌, విష్కి లేదా ఇతర లిక్కర్‌ను ప్రామాణిక మోతాదులో తీసుకోవచ్చని తేల్చింది. దాంతో గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, గుండపోటు, మధుమేహం వంటివి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. 

మరోవైపు.. వృద్ధులతో పోలిస్తే యువత ఆల్కాహాల్‌ తీసుకోవటం ద్వారా ఎక్కువ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. 15-39 ఏళ్ల వయసు వారు లిక్కర్‌ తీసుకోవటం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవటా. ప్రస్తుతం మద్యం సేవిస్తున్నవారిలో వీరి వాటానే ఎక్కువ. ఈ వయసు వారిలోనే 60 శాతానికిపైగా ఆల్కాహాల్‌ సంబంధిత సమస్యలకు గరువుతున్నట్లు అధ్యయనం తేల్చింది. బైక్‌ ప్రమాదాలు, ఆత్మహత్యలు, దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొంది. 

'యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. 40 ఏళ్లు పైబడిన వారు కొద్దిగా లిక్కరు తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారని నమ్మకం లేకపోయినప్పటికీ.. మా అధ్యయనంతో కొంత వరకైనా మారుతారనే నమ్మకం ఉంది.' అని పేర్కొన్నారు వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎమ్మాన్యూయెల్‌ గాకిడో. మహిళలు, పురుషుల్లో ఆల్కహాల్‌ తీసుకుంటే వచ్చే ముప్పుపై అధ్యయనం చేశారు పరిశోధకులు. క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు వంటి 22 సమస్యలపై.. వ్యాధులతో ప్రపంచ వ్యయం 2020 డేటాను వినియోగించుకున్నారు.

15-95 ఏళ్ల వయసువారిపై పరిశోధన.. 
1990- 2020 మధ్య 15-95 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, ఆడవారిపై అధ్యయనం చేశారు పరిశోధకులు. 2020 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటాను ఉపయోగించి హృదయ వ్యాధులు, క్యాన్సర్లతో సహా 22 ఆరోగ్య ఫలితాలపై ఆల్కహాల్ వినియోగం ప్రమాదాన్ని పరిశీలించారు. 204 దేశాల‍్లో ఈ పరిశోధన చేపట్టారు. 40-60 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు ప్రామాణిక మేతాదులో సగం తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేల్చారు. 65 ఏళ్లు పైబడిన వారిలో రోజులో మూడు ప్రామాణిక మోతాదులకన్నా ఎక్కువ మోతాదు తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు.. 15-39 వయసు వారు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే రోజుకు ప్రామాణిక మోతాదులో 0.136 వంతు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే.. మహిళలకు రోజుకు 0.273గా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్‌మెంట్‌లో తాగి విమానంలో రచ్చ రచ్చ..

మరిన్ని వార్తలు