Sri Lanka: తీవ్ర సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195

12 Oct, 2021 16:57 IST|Sakshi

కొలంబో: ఏడాది కాలంగా శ్రీలంక ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ మొరపెట్టుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు మీద శ్రీలంక ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేయడమే దీనికి ప్రధాన కారణం. గత శుక్రవారం వంట గ్యాస్‌ సిలిండర్‌ (12.5 ​కేజీలు) ధర​ రూ.1,400 ఉండగా ప్రస్తుతం రూ. 1,257 పెరిగి రూ. 2,657కు చేరుకుంది. ఒక కిలో పాలపొడి ధర వారం క్రితం రూ.250కాగా, ఇప్పుడు ఐదు రెట్లు పెరిగి రూ.1,195గా ఉంది.

ఇవి మాత్రమే కాకుండా గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత గురువారం దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షతన కేబినెట్ సమావేశమై ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా నిత్యావసరాల సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

చదవండి: (బాప్‌రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!)

ఈ పరిస్థితికి కారణం ఏంటంటే..
ప్రభుత్వం నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది.

నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. 

చదవండి: (వైరల్‌: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు)

మరిన్ని వార్తలు