అన్ని జీవుల జన్యుగుట్టు తేల్చే ప్రాజెక్ట్‌!

20 Jan, 2022 04:41 IST|Sakshi

18 లక్షల ప్రజాతుల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసే ఈబీపీ

మెల్‌బోర్న్‌: ప్రపంచంలోని ప్రతి సంక్లిష్ట జాతి జన్యువుల లోగుట్టును విశదీకరించే భారీ ప్రాజెక్టు పూర్తైతే జీవశాస్త్రంలో సంచలనాలు చూడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో దాదాపు 18 లక్షల స్పీసిస్‌ (ప్రజాతులు) జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసే ద ఎర్త్‌ బయోజీనోమ్‌ ప్రాజెక్ట్‌ (ఈబీపీ)కు 2018లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, పురోగతి తదితర వివరాలను మంగళవారం సైన్స్‌ జర్నల్స్‌లో ప్రచురించారు. ఈ ప్రాజెక్టు పూరై్తతే ఇంతవరకు జరిగిన బయోలాజికల్‌ రీసెర్చ్‌ రూపురేఖలు మారతాయి.

విశేషాలు..
► ఈ ప్రాజెక్టులో 22 దేశాలకు చెందిన 44 సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. సుమారు 5వేల మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు.
► ప్రాజెక్టుకు దాదాపు 470 కోట్ల డాలర్ల వ్యయమవుతుందని అంచనా.   
► సంక్లిష్ట జీవులు ఎలా ఉద్భవించాయి? జీవ వైవిధ్యత ఎలా మనుగడ సాగిస్తోంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రాజెక్టుతో లభిస్తాయని అంచనా.
► హ్యూమన్‌ జీనోమ్‌  సీక్వెన్సింగ్‌ ప్రాజెక్ట్‌ ప్రేరణతో 2016లో ఈబీపీని ప్రతిపాదించారు, 2018 నవంబర్‌లో అధికారికంగా ప్రారంభించారు.  
► ప్రతి కుటుంబం (టాక్జానమీలో  ఫ్యామిలీ) నుంచి కనీస ఒక్క జీనోమ్‌  సీక్వెన్సింగ్‌ను తొలిదశలో పూర్తి చేయాలని సంకల్పించారు.
► రెండోదశలో సుమారు 1.8లక్షల జాతుల  సీక్వెన్సింగ్‌ చేస్తారు, మూడోదశలో అన్ని జీవుల  సీక్వెన్సింగ్‌ పూర్తవుతుంది.
► ఏకకణ జీవుల నుంచి మానవుల వరకు భూమిపై ఉన్న అన్ని జీవుల జీనోమ్‌  సీక్వెన్సింగ్‌ ఈ ప్రాజెక్టులో పూర్తి చేస్తారు. అంటే దాదాపు ప్రతి ప్రాణి జన్యు గుట్టును ఈ ప్రాజెక్టు బహిర్గతం చేస్తుంది.  
► దీనివల్ల భవిష్యత్‌లో వైద్య, ఫార్మా రంగాల్లో ఊహించని పురోగతి సాధించవచ్చని పరిశోధకుల అంచనా.   

 

మరిన్ని వార్తలు