సముద్ర గర్భంలో భూకంపం: తప్పిన సునామీ ముప్పు

10 Apr, 2021 19:57 IST|Sakshi

బాలి, జావా సమీపంలో ప్రమాదం

ఆరుగురు దుర్మరణం

బాలి: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. అకస్మాత్తుగా భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ పరిణామానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన పర్యాటక ప్రాంతం బాలికి కొన్ని కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. అయితే ప్రకంపనలు సముద్ర గర్భంలో రావడంతో అందరూ సునామీ వస్తుందని భయపడ్డారు. కానీ అలాంటి ముప్పేమీ లేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది.

ఇండినేషియాకు సమీపంలోని ద్వీపకల్పం బాలి, జావా సమీపంలో సముద్ర గర్భాన శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూ ప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్‌ స్కేల్‌పై 6.0గా నమోదైందని అక్కడి అధికారి రహ్మత్‌ ట్రియోరీ తెలిపారు. ఈ ధాటికి ద్వీపకల్పంలోని కొన్ని భవనాలు కూలిపోయాయి. దీంతో ఆరుగురు మృతి చెందారు. అయితే సముద్ర గర్భంలో ప్రకంపనలు రావడంతో సునామీ వచ్చే ముప్పు ఉందేమోనని స్థానికులు భయాందోళన చెందారు. సునామీ వచ్చే అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు జావాకు 82 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భాన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. 

మరిన్ని వార్తలు