ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో రైసీ గెలుపు

20 Jun, 2021 03:50 IST|Sakshi

దుబాయ్‌: ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ ఘన విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఇప్పటిదాకా 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తవగా వాటిలో 62 శాతం ఓట్లను రైసీ దక్కించుకున్నట్లు ఇరాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ శనివారం ప్రకటించింది. ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన నేత అయిన అయతొల్లా అలీ ఖమేనీకి రైసీ అత్యంత ఆప్తుడు. రైసీ ప్రస్తుతం ఇరాన్‌ చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించాలన్న పిలుపులతోపాటు చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో 5.9 కోట్ల ఓటర్లలో 2.89 కోట్ల మందే ఓటేశారు.

పోలైన ఓట్లలో రైసీకి 1.79 కోట్ల ఓట్లు పడ్డాయి. రైసీతో పోటీపడిన మాజీ రెవల్యూషనరీ గార్డ్‌ కమాండర్‌ మొసెన్‌ రెజాయీకి 34 లక్షల ఓట్లు, అబ్దుల్‌నాజర్‌ హెమ్మతీకి 24 లక్షల ఓట్లు దక్కాయి. మరో అభ్యర్థికి 10 లక్షల ఓట్లు పడ్డాయి. ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌ శాతం నమోదవడం తెల్సిందే. రైసీ గెలుపును ఖరారుచేస్తూ ఇంకా అధికారిక ఫలితాలు వెల్లడికాలేదు. రైసీకి గట్టి పోటీ ఇవ్వగలరని భావించిన అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ నేతృత్వంలోని ప్యానెల్‌ తిరస్కరించడంతో రైసీ సునాయాసంగా గెలిచారు. 60 ఏళ్ల రైసీ గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడినా ప్రస్తుత అధ్యక్షుడు హసన్‌ రౌహానీ చేతిలో ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో గెల్చిన రైసీ ఆగస్టులో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు