కూతుళ్ల కోసం అమ్మగా మారిన నాన్న.. లింగాన్ని మార్చుకొని న్యాయపోరాటం..

6 Jan, 2023 14:51 IST|Sakshi

కన్నకూతుళ్లను దక్కించుకోవడం కోసం ఓ వ్యక్తి తన లింగాన్ని మార్చుకున్నాడు. చట్టపరంగా పోరాటం చేసి ఐడీ కార్డులో మగ నుంచి ఆడగా మారాడు. ఈక్వేడార్‌లో ఈ ఘటన జరిగింది.  చట్టపరంగా లింగాన్ని మార్చుకున్న ఈ వ్యక్తి పేరు రినె సలినాస్ రామోస్(47). భార్యతో విడిపోయాడు. అయితే ఈ దేశ చట్టాల ‍ప్రకారం  పిల్లలు తల్లిదగ్గరే ఉండాలనే నిబంధన ఉంది. కానీ తన కూతుళ్లు తల్లి వద్ద సంతోషంగా లేరని, తనకు అప్పగించాలని రామోస్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం అందుకు ఒప్పుకోలేదు.

దీంతో ఐడీ కార్డులో తన లింగాన్ని పురుషుడి నుంచి స్త్రీగా మార్చుకున్నాడు రామోస్. చట్టపరంగా అనుమతులు తీసుకున్నాడు. ఇప్పుడు తాను కూడా తల్లిని అయ్యానని, పిల్లలను తనకే అప్పగించాలని రామోస్ కోర్టును కోరాడు. అయితే న్యాయస్థానం దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది.

రామోస్ తన కూతుళ్ల కోసమే లింగాన్ని మార్చుకున్నప్పటికీ దేశంలోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము సర్జరీ చేయించుకొని ఆడ నుంచి మగగా, పురుషుడి నుంచి స్త్రీగా మారితే అధికారిక గుర్తింపు లభించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాంటిది ఓ పురుషుడు మాత్రం సులభంగా మహిళగా లింగాన్ని మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

అయితే తాను చేసిన దాంట్లో దురుద్దేశం ఏమీ లేదని రామోస్ పేర్కొన్నాడు. కేవలం తన కూతుళ్ల కోసమే ఇలా చేసినట్లు చెప్పాడు. పురుషులకు కూడా తమ పిల్లలపై హక్కు కల్పించేందుకే తాను పోరాడుతున్నట్లు వివరణ ఇచ్చాడు.
చదవండి: బీజింగ్‌లో కోవిడ్‌ బీభత్సం

మరిన్ని వార్తలు