పాములతో మసాజ్‌.. అదే ఆ స్పా స్పెషల్‌!

30 Dec, 2020 12:58 IST|Sakshi

కైరో: అలసటతో నీరసించిపోయిన శరీరాన్ని ఉత్తేజితం చేసుకునేందుకు చాలా మంది స్పాలను ఆశ్రయిస్తారన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వివిధ రకాల తైలాలతో మర్ధనా చేస్తూ కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా స్పా నిర్వాహకులు సరికొత్త టెక్నిక్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఈజిప్టులోని కైరోలో గల ఓ స్పా సెంటర్‌ మాత్రం పాములతో బాడీ మసాజ్‌ చేస్తూ వినూత్నంగా నిలిచింది. ఈ ప్రక్రియ ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ ఉల్లాసంగా ఉండవచ్చంటున్నారు నిర్వాహకులు. తమ స్పాలో కొండచిలువలు సహా వివిధ రకాల విష రహిత పాములను ఉపయోగిస్తూ కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం గురించి స్పా యజమాని సఫ్వాట్‌ సెడికి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘స్నేక్‌ మసాజ్‌’తో కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని, దీనితో రక్తప్రసరణ కూడా మెరుగు అవుతుందని పేర్కొన్నారు.


‘‘శారీరకంగా, మానసికంగా ఉల్లాసం అందించడమే ఈ మసాజ్‌ ముఖ్యోద్దేశం. రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా శరీరాన్ని ఉత్తేజితం అవుతుంది. ఎండార్ఫిన్ల విడుదలతో మానసిక సంతోషం కలుగుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక సదరు స్పాను సందర్శించిన ఓ కస్టమర్‌.. ‘‘నా శరీరంపై పాములను వేయగానే తొలుత కాస్త భయం వేసింది. కానీ నెమ్మదిగా భయం, టెన్షన్‌ మాయమయ్యాయి. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. నా వీపు మీద పాములు పాకుతూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం’’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఇక స్నేక్‌ మసాజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతమంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందించగా.. చాలా మంది.. ‘‘అమ్మ బాబోయ్‌.. పాములు మీద పాకితే ఇంకేమైనా ఉందా. భయంతో గుండె ఆగిపోయినా ఆగిపోతుంది’’ అంటూ భయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు