జనం పరుగో పరుగు.. ఇండియన్‌ ఏనుగు అంతే!

22 Mar, 2021 21:48 IST|Sakshi
వీడియో దృశ్యం

మాస్కో : సర్కస్‌లో ఫీట్లు చేయాల్సిన ఓ ఇండియన్‌ ఏనుగు అసూయతో భీకర ఫైట్‌కు తెర తీసింది. సర్కస్‌ మధ్యలో తోటి ఏనుగుపై కలబడి కుమ్ములాడింది. దీంతో పడిపడి నవ్వటానికి వచ్చిన జనం.. భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన రష్యాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం రష్యాలోని కాజన్‌లో ‘ సర్కస్‌ మాయాజాలం.. ఏనుగుల ప్రదర్శన’ పేరిట ఓ సర్కస్‌ జరిగింది. దీన్ని చూడటానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. షో ప్రారంభమైన తర్వాత ఇండియాకు చెందిన రెండు ఆడ ఏనుగులు జెన్నీ, మగదలు ‍ఫీట్లు చేయటానికి రింగులోకి వచ్చాయి. వాటి ట్రైనర్‌ సూచనలు చేస్తూ వాటితో ఫీట్లు చేయిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ట్రైనర్‌ తనకంటే ఎక్కువగా మగదకు ప్రాధాన్యత ఇస్తున్నాడని భావించిన జెన్నీ మగదపై దాడికి దిగింది. దాన్ని కిందపడేసి కుమ్మటం మొదలుపెట్టింది. రింగ్‌ అవతలకు తోయటానకి ప్రయత్నించింది. దీంతో బెంబేలెత్తిపోయిన జనం భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సర్కస్‌ సిబ్బంది జెన్నీని అదిలించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ట్రైనర్‌ తన కంటే మగదకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే అసూయతోనే జెన్నీ దాడికి దిగిందని సర్కస్‌ నిర్వహకులు చెబుతున్నారు. ఈ సంఘటనలో ఏనుగులు కానీ, జనం కానీ గాయపడలేదని తెలిపారు.

చదవండి : వైరల్‌గా మారిన ప్రపంచ కుబేరుల పాత ఫొటో

మరిన్ని వార్తలు