సొంత పట్టణం నిర్మించనున్న ఎలాన్‌ మస్క్‌

13 Mar, 2023 04:07 IST|Sakshi

టెక్సాస్‌: ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ఎలాన్‌ మస్క్‌ సొంతంగా ఒక పట్టణాన్నే నిర్మించబోతున్నారు. ఇందుకోసం ఆయన కంపెనీలు, అనుబంధ సంస్థలు టెక్సాస్‌లో వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నాయని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. ఆస్టిన్‌కు సమీపంలోని బస్ట్రోప్‌ కౌంటీలోసుమారు 3,500 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి. స్నెయిల్‌ బ్రూక్‌ అనే పేరుతో సొంత పట్టణాన్ని నిర్మించే పనుల్లో ఎలాన్‌ మస్క్‌ నిమగ్నమై ఉన్నారు.

ప్రధానంగా మస్క్‌కు చెందిన బోరింగ్‌ కంపెనీ, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ తదితర సంస్థలకు ఆస్టిన్‌ సమీపంలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కొత్త పట్టణంలో మార్కెట్‌ ధర కంటే చౌకగానే ఆఫీసులను ఏర్పాటు చేయనున్నాయి. ఉద్యోగుల నివాసాలు కూడా ఇందులోనే ఉంటాయి. నూతనంగా రూపుదాల్చే స్నెయిల్‌ బ్రూక్‌లో 100కు పైగా భవనాలను నిర్మిస్తారు. ఇందులో స్విమ్మింగ్‌ పూల్, క్రీడా మైదానాల వంటి ఏర్పాట్లూ ఉంటాయి. టెస్లా ప్రధాన కార్యాలయంతోపాటు తన వ్యక్తిగత నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారుస్తానని గతంలోనే మస్క్‌ ప్రకటించారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం గుర్తు చేసింది.

మరిన్ని వార్తలు