ఒక్క నిమిషం పట్టదు.. ఏడాది తర్వాత పుతిన్‌ బెదిరింపులు వెలుగులోకి..

30 Jan, 2023 08:47 IST|Sakshi

లండన్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌ దురాక్రమణకు కొన్నిరోజుల ముందు ఫోన్‌ చేసి మరీ తనపై వ్యక్తిగత దాడికి పాల్పడతానని బెదిరించాడని జాన్సన్‌ పేర్కొన్నారు. 

ఫిబ్రవరి 24 ఉక్రెయిన్‌ ఆక్రమణకు కొన్నిరోజుల ముందు నా కార్యాలయానికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందని, వ్యక్తిగతంగా తనపై మిస్సైల్‌ దాడికి పాల్పడతానని పుతిన్‌ తనను బెదిరించాడని బోరిస్‌ జాన్సన్‌ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు బోరిస్‌ వ్యాఖ్యలతో కూడిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ తాజాగా ప్రసారం చేసింది. 

‘‘బోరిస్‌.. మిమ్మల్ని గాయపర్చడం నా ఉద్దేశం కాదు. కానీ, మీపై మిస్సైల్‌ దాడి తప్పదు. అందుకు ఒక్క నిమిషం చాలు. అలా అంతా అయిపోతుంది’’ అని పుతిన్‌ ఆ ఫోన్‌కాల్‌లో బెదిరించినట్లు జాన్సన్‌ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ ఫోన్‌కాల్‌లోనే ఉక్రెయిన్‌ నాటో చేరిక వ్యవహారం గురించి హాట్‌ హాట్‌గా పుతిన్‌ కామెంట్లు చేశాడని బోరిస్‌ తెలిపారు. ఆ సమయంలో తాను చాలా సహనంగా వ్యవహరించానని బోరిస్‌ గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ ఆక్రమణను ఖండించిన పాశ్చాత్య దేశాల నేతల్లో బోరిస్‌ జాన్సన్‌ కూడా ఉన్నారు. యుద్ధం మొదలైన కొన్నాళ్లకు.. హఠాత్తుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు బోరిస్‌.

>
మరిన్ని వార్తలు