ఆస్ట్రేలియా-ఫేస్‌బుక్‌ల మధ్య డీల్‌ కుదిరింది

23 Feb, 2021 15:45 IST|Sakshi

కాన్‌బెరా:  గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఫేస్‌బుక్‌కు నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వీరి మధ్య సంధి కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా న్యూస్ ఏజెన్సీలకు చెందిన వార్తలపై నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది. త్వరలో మళ్లీ తమ సైట్‌లో వార్తలు పునరుద్ధరిస్తామని ప్రకటించింది. గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాలలో వార్తలు షేర్ చేస్తున్నందుకు వార్తాసంస్థలకు ఆ సంస్థలు డబ్బులు చెల్లించాలన్న చట్టం తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్ ఆస్ట్రేలియాలోని‌ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్‌ చేయడాన్ని బ్లాక్‌ చేసింది. 

ఫేస్‌బుక్ వార్తలు నిలిపివేయడంతో దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఇక తప్పని పరిస్థితులలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారి ఫ్రైడెన్‌బర్గ్, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఫేస్‌బుక్ కూడా న్యూస్ పేజీలపై విధించిన నిషేధం తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఈస్టన్ తెలిపారు. ఇదిలా ఉంటే గూగుల్ మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియాలోని చిన్న చిన్న సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం న్యూస్ షోకేస్ అనే ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి వార్తా సంస్థలు పోస్ట్ చేసే వార్తలన్నీ అందులో కనిపించేలా కొత్త విధానాలను రూపొందించినట్లు సమాచారం.

చదవండి:

ఆస్ట్రేలియాకు మైక్రోసాఫ్ట్‌ మద్దతు..గూగుల్‌ వైదొలిగేనా?

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో బయటపడ్డ మరో భారీ మోసం

మరిన్ని వార్తలు