నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు బిగ్ రిలీఫ్‌.. 'గ్రే లిస్ట్' నుంచి తొలగింపు

21 Oct, 2022 21:30 IST|Sakshi

పారిస్‌: పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. ఉగ్రవాదుల ఆర్థిక విషయాలపై నిఘా వహించే ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్).. ఆ దేశాన్ని నాలుగేళ్ల తర్వాత 'గ్రే లిస్ట్' నుంచి తొలగించింది. ఉగ్రవాదుల కార్యకలాపాల విషయంలో పాక్‌ పురోగతి సాధించిందని, తీవ్రవాద సంస్థలకు నిధుల చేరవేతలో దిగొచ్చిందని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పారిస్‌లో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన  విడుదల చేసింది.

అయితే అనూహ్యంగా మరో ఆసియా దేశం మయన్మార్‌ను బ్లాక్ లిస్టులో చేర్చింది ఎఫ్‌ఏటీఎఫ్. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్ దేశాలను కొత్తగా గ్రే లిస్టులో చేర్చింది. పాకిస్తాన్‌, నికరాగ్వా దేశాలను ఈ జాబితా నుంచి తొలగించింది.

ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లించడమే గాక, తీవ్రవాదుల పట్ల సానుభూతిగా ఉండే పాకిస్థాన్‌ను వరుసగా నాలుగేళ్ల పాటు గ్రే లిస్టలో ఉంచింది ఎఫ్‌ఏటీఎఫ్. తాము తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని, అనేక మంది టెర్రరిస్టులను అరెస్టు చేస్తున్నామని పాకిస్తాన్ కొద్ది సంవత్సరాలుగా చెబుతున్నా ఎఫ్‌ఐటీఎఫ్ దాన్ని సమర్థించలేదు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు తగ్గినందున ఆ దేశానికి ఊరటనిచ్చింది.
చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 66,000 మంది రష్యా సైనికులు మృతి!

మరిన్ని వార్తలు