China Flash Floods: చైనాలో ఆకస్మిక వరదలకు 12 మంది బలి

18 Jul, 2022 16:29 IST|Sakshi

బీజింగ్‌: నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం కారణంగా వరదలు సంభవించి సిచువాన్‌ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం నాటికి ఈ ప్రాంతంలో 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది.

వాయువ్య గన్సు రాష్ట్రంలోని లాంగ్నాన్ నగరంలోనూ వరదల వల్ల ఆరుగురు చనిపోయినట్లు మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో 3000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించినట్లు పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లోనే వర్షపాతం 98.9 మిల్లీమీటర్లకు చేరిందని, జులై సగటుతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని వెల్లడించింది. 

ఒకవైపు చైనాలోని తూర్పు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే నైరుతి, వాయవ్య ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. తూర్పు జెజియాంగ్ రాష్ట్రం, షాంఘై నగరాల్లో గతవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయయ్యాయి.

వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేడి గాలులు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయని, ఆ నీరు ఒక్కసారిగా విడుదలైనప్పుడు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తాయని చెప్పారు. ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తాయని పేర్కొన్నారు.
చదవండి: మంటల్లో కాలిపోతున్న ఇల్లు..హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్

మరిన్ని వార్తలు