యూరప్‌ను ముంచెత్తిన వరదలు.. 40 మంది మృతి 

16 Jul, 2021 08:46 IST|Sakshi

బెర్లిన్‌: జర్మనీ, బెల్జియంలలో భారీ వర్షాలు, వరదలతో 40 మంది చనిపోగా పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. జర్మనీలోని యూస్కిర్చెన్, అహ్రెవీలర్, కొలోన్‌ తదితర ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో సుమారు 35 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. చాలా నివాస ప్రాంతాలు దెబ్బతినడంతో 70 మంది వరకు గల్లంతయ్యారు. అదేవిధంగా, జర్మనీ సరిహద్దులకు సమీపంలోని బెల్జియంలో సంభవించిన వరదల్లో ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.

ఇంకా, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్‌ల్లోనూ వరద తీవ్రతకు సమాచార, రవాణా వ్యవస్థ స్తంభించిందని అధికారులు చెప్పారు. చాలా నివాస ప్రాంతాలు నీట మునిగాయి. కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరప్‌వాసులకు నెటిజన్లు సంఘీభావం ప్రకటిస్తూ త్వరగా ఈ కష్టం నుంచి గట్టెక్కాలని ప్రార్థిస్తున్నారు.

మరిన్ని వార్తలు