ఔను! ఉక్రెయిన్‌ యద్ధం విషయంలో మోదీ చెప్పింది కరెక్ట్‌... ప్రశంసించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

21 Sep, 2022 11:32 IST|Sakshi

Prime Minister Narendra Modi was right: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్‌ ఇమ్మాన్యయేల్‌ మాక్రాన్‌ ప్రశంసించారు. ఈ మేరకు మాక్రాన్‌ న్యూయార్క్‌‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 77వ సమావేశంలో మోదీ సందేశాన్ని ప్రస్తావిస్తూ..ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో మోదీ పుతిన్‌కి ఇచ్చిన సందేశం సరైనదని అన్నారు.

ఔను! ఇది యుద్ధానికి సరైన సమయం కాదు అని మోదీ వ్యాఖ్యలను పునురుద్ఘాటించారు. ప్రస్తుతం పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా వ్యతిరేకించడానికి సరైన సమయం కాదని, మనమంతా సమిష్టిగా మన సార్వభౌమాధికారాలను కాపాడుకుంటూ సవాళ్లను ఎదర్కొనే సమయం అని పుతిన్‌కి మోదీ హితువు పలికారు. ఆ విషయాలను గురించే మాక్రాన్‌ మాట్లాడుతూ మోదీని పొగడ్తలతో ముంచెత్తారు.

ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ పుతిన్‌తో ఉక్రెయిన్‌ యుద్ధం విషయమై ఇలా సంభాషించారు. ఆ సదస్సులో మోదీ పుతిన్‌తో ఇంకా ...."భారత్‌ రష్యా ద్వైపాక్షిక సంబంధాలు సమస్యలు గురించి చాలా సార్లు మాట్లాడానంటూ గుర్తు చేశారు. ఆహారం, ఇంధన భద్రత, ఎరువుల సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు కనుగొనాలి అన్నారు.

అలాగే ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్థులను తరలించడంలో మాకు సహాయం చేసినందుకు రష్యాకి, ఉక్రెయిన్‌కి ధన్యావాదాలు" అని మోదీ చెప్పారు. ఆ వ్యాఖ్యలకు పుతిన్‌ స్పందించి...ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్‌ విధానం గురించి తమకు తెలుసునని, భారత్‌ ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని అన్నారు. సాధ్యమైనంతవరకు దీన్ని ముగించేయాలనే అనుకుంటున్నాం అని చెప్పారు. అంతేగాదు రష్యా భారత్‌ల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, అవి మరింతగా కొనసాగుతాయని పుతిన్‌ అన్నారు. 

(చదవండి: రాణి పోయింది... రాజ కుటుంబ కలహాల పుల్‌స్టాప్‌కు ఇదే రైట్‌ టైం)
 

మరిన్ని వార్తలు