ఇక భవిష్యత్‌ అంతా ‘ఈ–సైకిళ్ల’దే!

28 Nov, 2020 20:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతోన్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్‌ వాహనాలు క్రమంగా మాయం అవుతున్నాయి. ఆ స్థానంలో ఈ–కార్లతోపాటు ఈ–బైకులు, ఈ–సైకిళ్లు వస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు, అలవాట్లకు అనుగుణంగా వీటిలో వేల మోడల్స్‌ వస్తున్నాయి. 2020, ఏప్రిల్‌ నెల నాటికి ఇంగ్లండ్‌ రోడ్లపైకి దాదాపు మూడు లక్షల ఎలక్ట్రిక్‌ కార్లు రానున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతోన్న ఎలక్ట్రానిక్‌ వాహనాలకు మాత్రం కరోనా కారణంగా మేలే జరిగింది. ఈ రంగానికి కొత్త ఊపునిచ్చింది. కరోనా వైరస్‌కు వాతావరణ కాలుష్యం కూడా తోడై ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నం అవుతుండడంతో ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగానికి పలు దేశాల ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో టార్గెట్‌లు ముందుకు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే బ్రిటన్‌లోని అతిపెద్ద సైక్లింగ్‌ కంపెనీ ‘హాల్‌ఫోర్డ్స్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్, హైబ్రీడ్‌ వాహనాల సర్వీసు రంగంలో అనూహ్యంగా దూసుకుపోయింది. ‘హాల్‌ఫోర్డ్స్‌’కు దేశంలో 300లకు పైగా ఆటోసెంటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఏ కంపెనీకి లేనివిధంగా ఈ కంపెనీ 30 ఈ బైకుల మోడల్స్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుబోతున్న ‘గ్జివోమి ఎం 365’ ఈ స్కూటర్‌ ఈ కంపెనీకి చెందినదే కావడం విశేషం. ఈ సైకిళ్లకు, సాధారణ సైకిళ్లకు పెద్ద తేడాలేదు, ఓ చిన్న బ్యాటరీ, దాంతో తిరిగే చిన్న మోటారు తప్ప. పైగా ఇన్సురెన్స్‌ అవసరం లేదు. రోడ్డు పన్ను అసలే లేదు.

చదవండి: కరోనాకు వ్యాక్సిన్లు రావడం ఓ భ్రమేనా!?

మరిన్ని వార్తలు