విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం

31 Aug, 2022 07:15 IST|Sakshi

కరోనా మహమ్మారితో విలవిల్లాడిపోయి గత రెండేళ్లుగా గణేశుడి ఉత్సవాలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్‌–19 భయాలు అంతగా లేకపోవడం, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలకి పూర్తిగా అవగాహన రావడంతో హరిద్వార్‌ నుంచి భువనేశ్వర్‌ వరకు పెద్ద ఎత్తున విఘ్నాధిపతిని కొలవడానికి ఏర్పాట్లు చేశారు. ఏనుగు తలతో పిల్లల్ని ఆకర్షించే రూపురేఖలతో గణపతి బప్పా కొలువై ఉండడం ఈ పండుగకి విదేశాల్లో కూడా ఎనలేని ప్రాముఖ్యత ఉంది.

గణేశుడిపై అధ్యయనం చేసిన కాలిఫోర్నియా ప్రొఫెసర్‌ రాబర్ట్‌ ఎల్‌ బ్రౌన్‌ ఆగ్నేయాసియాలో 5, 6 శతాబ్దాల్లోనే గణేశుడి ప్రతిమలు శాసనాల్లో కనిపించాయని వెల్లడించారు. పలు ఆసియన్‌ దేశాల్లో బొజ్జ గణపయ్య ఆరాధన ఎప్పట్నుంచి ఉందో ఆ ప్రొఫెసర్‌ ఒక ఆరి్టకల్‌లో వివరించారు. భారత్‌లో 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ పాలనలో గణేశుడి ఉత్సవాలు ఘనంగా జరిగేవి. పుణెలో 18వ శతాబ్దంలో పెషావర్లు గణపతి ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఇక స్వాతంత్య్ర పోరాటం సమయంలో హిందువులందరినీ ఏకం చెయ్యడానికి లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ వినాయక చవితి ఊరేగింపుల్ని దేశవ్యాప్తం చేశారు.  

కాంబోడియా: 7వ శతాబ్దం నుంచే కాంబోడియా ప్రజలు గణేశుడ్ని ప్రథమ దేవుడిగా తొలి పూజలు అందిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న ఆలయాలన్నీ వినాయకుడికే అంకితమిచ్చారు. భారత్‌లో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముందే కాంబోడియాలో గణపతిని కొలడం విశేషం. ఈ దేశంలో గణేశ్‌ ప్రతిమలు ఎక్కువగా నిల్చొనే భంగిమలో మాత్రమే ప్రతిíÙ్ఠస్తారు. కొన్ని కూడళ్లలో కూడా భారీ సైజులో గణేశుడి విగ్రహాలు కనిపిస్తాయి.

థాయ్‌లాండ్‌: థాయ్‌లాండ్‌లో 10వ శతాబ్దం నుంచే గణపతిని కొలుస్తారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. తమిళం, థాయ్‌ భాషల్లో రాసిన శాసనాలపై కంచుతో తయారు చేసిన గణేశుడి ప్రతిమ ఫాంగ్‌ నా ప్రాంతంలో లభించింది. ఈ దేశంలో వ్యాపారస్తులు గణేశుడిని ఎక్కువగా పూజించి బంగారం, మిఠాయిలు సమర్పిస్తూ ఉంటారు. విజయ గణపతిగా కీర్తిస్తారు. సాంస్కృతిక నగరంగా పేరుగాంచిన చాకోఎంగ్సావో నగరం గణేశుడి నగరంగా ఖ్యాతి పొందింది. ఇక్కడ గణేశుడికి 3 ఆలయాలు ఉన్నాయి. బ్యాంకాక్‌లోని సెంట్రల్‌ వరల్డ్‌ ఎదురుగా గణేశుడి మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. థాయ్‌ ప్రభుత్వంలోని ఫైన్‌ ఆర్ట్స్‌ శాఖ చిహ్నంగా గణేశుడే ఉండడం విశేషం.  

చైనా: చైనాలో గణేశుడి పురాతన విగ్రహం తన్‌ హువాంగ్‌ ప్రాంతంలోని తవ్వకాలలో బయటపడింది. కుంగ్‌ హుస్సేన్‌ ప్రాంతంలోని గణేశుడి ఆలయం ఉన్నాయనడానికి 531 కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం చైనాలో గణేశుడి ఒక నెగిటివ్‌ ఫోర్స్‌గా చూస్తారు. ఏదైనా పనికి అవరోధంగా నిలిచేవాడిగానే చిత్రీకరిస్తూ ఉంటారు.  

జపాన్‌: జపాన్‌లో 8వ శతాబ్దంలోనే గణేశుడిని పూజించినట్టు ఆధారాలున్నాయి. అత్యంత శక్తిమంతుడైన దేవుడిగా చూసేవారు. వ్యాపారులు, జూదగాళ్లు, కళాకారులు ఎక్కువగా గణేశుడిని ఆరాధించేవారు. బౌద్ధ ఆరామాలలో గణేశుడి విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి.  

అఫ్గానిస్తాన్‌: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌కి సమీపంలో గార్జెడ్‌లో 7–8 శతాబ్దాల్లోనే గణేశుడి విగ్రహం లభ్యమైంది. ఇండో ఆఫ్గాన్‌ మధ్య సంబంధాలకు ప్రతీకగా ఈ గణేశుడు ఉండేవాడని పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్పారు.  

టిబెట్‌: టిబెటన్‌ బుద్ధిజంలో కూడా గణేశుడి ఆరాధన ఉంది. 11వ శతాబ్దంలో తొలిసారిగా వినాయకుడిపై భారతీయ రచనలు ఎన్నింటినో టిబెటిక్‌ భాషలోకి అనువదించారు. టిబెట్‌ పురాణాల్లో కూడా గణేశుడి ప్రస్తావన ఉంది. లామాయిజం వ్యాప్తిలో గణేశుడ్ని కూడా వినియోగించుకున్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
చదవండి: గణేష్‌.. జోష్‌

మరిన్ని వార్తలు