CRISPR Technology: తొలి అడుగు పడింది!

6 Jul, 2021 10:11 IST|Sakshi

అంతరిక్షంలో క్రిస్పర్‌ టెక్నిక్‌!

జన్యువులను మన అవసరానికి తగ్గట్టు కత్తిరించేందుకు, భాగాలను చేర్చేందుకు, తొలగించేందుకు క్రిస్పర్‌ టెక్నాలజీ ఉపయగపడుతుంది.  కేన్సర్‌ సహా అనేక వ్యాధులకు క్రిస్పర్‌ టెక్నాలజీ చికిత్స కల్పించగలదని అంచనా. ఇలాంటి టెక్నాలజీని తొలిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు అంతరిక్షంలోనూ విజయవంతంగా ఉపయోగించారు.  ఈ కేంద్రంలో వ్యోమగాములకు వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి మార్గమూ లేదు. రేడియో ధార్మికత,  గుండెజబ్బులు, మతిమరుపు వ్యోమగాములకు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ సమస్యలను అధిగమించేందుకు క్రిస్పర్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘జీన్స్‌ ఇన్‌ స్పేస్‌’ పేరుతో శాస్త్రవేత్తలు క్రిస్పర్‌ టెక్నాలజీపై ప్రయోగాలు మొదలుపెట్టారు. రేడియో ధార్మికత కారణంగా సంభవించే డీఎన్‌ఏ నష్టాన్ని క్రిస్పర్‌ సాయంతో అంతరిక్ష కేంద్రంలోని ఈస్ట్‌లో కలిగించారు. అప్పుడు వాటిల్లో కలిగే మార్పులను.. భూమ్మీద ఉంచిన ఈస్ట్‌లోని మార్పులతో పోల్చి చూశారు. డీఎన్‌ఏ నష్టం పూర్తిగా బాగైతే ఈస్ట్‌ సమూహం మొత్తం ఎర్రగా మారేలా క్రిస్పర్‌ కిట్‌లో  ప్రత్యేక భాగాన్ని జత చేశారు. ప్రయోగం చేపట్టిన ఆరు రోజులకు అంతరిక్ష కేంద్రంలోని ఈస్ట్‌ సమూహాల్లో చాలా వరకు ఎర్రగా మారిపోయాయి. డీఎన్‌ఏ నష్టాలను సరిచేసుకునే దిశగా ఇది తొలి అడుగని శాస్త్రవేత్త సెబాస్టియన్‌ క్రేవ్స్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు