Afghanistan: తాలిబన్లకు మరో షాక్‌! సాయం నిలిపివేత

17 Aug, 2021 17:50 IST|Sakshi

బెర్లిన్‌:అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు జర్మనీ షాకిచ్చింది. అఫ్గన్‌కు డెవలప్‌మెంట్‌ సాయాన్ని తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు జర్మన్‌ డెవలప్‌మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ స్థానిక మీడియాకు వివరించారు.

దేశానికి అభివృద్ధి సహకారాన్ని ప్రస్తుతానికి నిలిపివేశామని రినిష్ పోస్ట్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్‌జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే పని కొనసాగుతుందన్నారు. అంతకుముందు అఫ్గన్‌ సంక్షోభంపై  స్పందించిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్ కాబూల్ విమానాశ్రయంలో వేలాదిమంది ప్రజలు దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సిగ్గుచేటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానవ విషాదానికి అందరమూ బాధ్యులమని వ్యాఖ్యానించారు. అలాగే తమ పౌరులతోపాటు, వారికి అండగా నిలిచిన అఫ్గాన్‌ ప్రజల క్షేమం కోసం తాము చేయ గలిగిందంతా చేస్తామని హామీ ఇచ్చారు.

కాగా సంవత్సరానికి 430 మిలియన్ యూరోలు (506 మిలియన్‌ డాలర్లు) అప్గానిస్తాన్‌కు అందించేందుకు జర్మనీ గతంలో అంగీకరించింది. తద్వారా అతిపెద్ద దాతలలో ఒకటిగా నిలిచింది. ఈ సాయాన్ని స్థానిక పోలీసు బలగాల శిక్షణకు,  న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అలాగే మహిళల హక్కుల రక్షణ, అవినీతిపై పోరుకు  ఉద్దేశించబడింది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్‌ తాలిబన్ల పూర్తి నియంత్రణలోకి వచ్చి, షరియా చట్టాన్ని ప్రవేశపెట్టి, దానిని ఖలీఫాత్‌గా మార్చినట్లయితే ఒక్క సెంటు కూడా అందించ బోమని జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్  గతవారం స్పష్టం చేశారు.

చదవండి : Aircraft crash: ఆఖరి క్షణాల షాకింగ్‌ వీడియో
Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!

మరిన్ని వార్తలు