నీ కుక్కను సరిగ్గా ట్రైన్‌ చేసుకో.. నా కుక్కనే అంటావా!

28 Dec, 2021 17:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెర్లిన్‌: సాధారణంగా కొందరు శునకాలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటిని ఎవరు ఏమన్నా.. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. జర్మనీలోని తురింజియా పట్టణంలో 27 ఏళ్ల మహిళ, 51 ఏళ్ల మరో మహిళ తమ పెంపుడు కుక్కలను తీసుకుని స్థానికంగా ఉన్న పార్కులో వాకింగ్‌కు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో ఒక శునకం.. మరో శునకాన్ని చూస్తు అరుస్తూ దాడికి తెగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 51 ఏళ్ల మహిళ.. మరో మహిళపై వాగ్వాదానికి దిగింది. శునకాన్ని సరిగ్గా ట్రైన్‌ చేసుకోవాలని చెప్పింది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ  గొడవ పెరిగి.. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడం వరకు వెళ్లింది. ఒకరిని మరోకరు కొరుక్కుంటూ గాయపర్చుకున్నారు. పాపం.. మహిళలిద్దరు కొట్టుకోవడాన్ని వారి శునకాలు చూస్తూ ఉండిపోయాయి.

ఆ‍ ప్రదేశంలో ఉన్న స్థానికులు వారి గొడవను ఆపటానికి సాహసించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరువురు  స్థానిక పోలీసుస్టేషన్‌ వెళ్లి  ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కన్నా.. శునకాలే నయం..’, ‘వామ్మో.. ఇలా కరుచుకున్నారేంటీ..’ అంటూ ఫన్నీగా కామెంట్‌లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు