చైనాకు మరో దెబ్బ : 2500 ఛానళ్లు తొలగింపు 

7 Aug, 2020 08:54 IST|Sakshi

వాషింగ్టన్ : కరోనా మహమ్మారికి సంబంధించి సరైన సమాచారం అందించలేదంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ కూడా చైనాపై కొరడా ఝళిపిస్తోంది. తమ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా చైనాతో ముడిపడి ఉన్న 2,500 కి పైగా యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించినట్టు ప్రకటించింది.  త్రైమాసిక బులెటిన్ వెల్లడి సందర్భంగా గూగుల్ ఈ విషయాన్ని వివరించింది.  స్పామ్, వివాదాస్పద కంటెంట్ ను  ఆయా ఛానల్స్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాయని తెలిపింది.  ఈ నేపథ్యంలో ఏప్రిల్-జూన్ మాసంలో వీటిని తొలగించినట్టు వెల్లడించింది.  (టిక్‌టాక్‌ కొనుగోలు: కీలక ఉత్తర్వులు!)

అయితే తప్పుడు సమాచారం వ్యాప్తి ఆరోపణలను చైనా గతంలో తీవ్రంగా ఖండించింది. గూగుల్ తాజా చర్యపై అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఇంకా స్పందించలేదు. మరోవైపు ఇండో- చైనా సరిహద్దుల్లో  చైనా దుశ్చర్య కారణంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్  దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ భద్రతకు ముప్పు అంటూ ప్రభుత్వం  టిక్ టాక్ సహా  వివిధ యాప్ లపై నిషేధించింది.  తాజాగా చైనాకు  ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది.  టిక్ టాక్, వీ చాట్  ద్వారా తమ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని ఆరోపించిన అధ్యక్షుడు ట్రంప్ వాటిని నిషేధించే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. 45 రోజుల్లోగా ఈ నిషేధం అమల్లోకి రానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి :  టిక్‌టాక్‌ విక్రయం : చైనా వార్నింగ్?

మరిన్ని వార్తలు