వికీపీడియాకు కేంద్రం నోటీసులు

3 Dec, 2020 10:11 IST|Sakshi

భారత్‌ మ్యాప్‌ను తప్పుగా చూపారని ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ మ్యాప్‌ను తప్పుగా చూపించిన వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తప్పును సరిదిద్దుకోకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంత లద్దాఖ్‌లో కాకుండా జమ్మూ కశ్మీర్‌లో అంతర్భాగంగా గత నెలలో వికీపీడియా చూపించిన విషయం తెలిసిందే. దీనిని ట్విటర్‌ వేదికగా ఓ నెటిజన్‌ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. నెటిజన్‌ ట్వీట్‌పై స్పందించిన కేంద్రం.. వికీపీడియా యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. ఈ చర్య భారతదేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం వికీపీడియాకు తెలియజేసింది. భారత ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఎ ప్రకారం ఉత్తర్వు జారీ చేసింది. వికీపీడియా తప్పును సరిదిద్దుకోవాలని, లేకుంటే సంస్థపై నిషేధం విధించడంతోపాటు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని 2020 నవంబర్ 27న జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వికీపీడియా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. (చదవండి: జమ్మూ కశ్మీర్‌లో కాల్పులు.. నలుగురు హతం)

మరిన్ని వార్తలు