పాక్‌లో 11మంది గని కార్మికుల కాల్చివేత

4 Jan, 2021 05:08 IST|Sakshi
మృతదేహాల వద్ద స్థానికుల నివాళి

కరాచీ: అల్పసంఖ్యాక వర్గాల ప్రజలే లక్ష్యంగా పాకిస్తాన్‌లో దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా, మైనారిటీ షియా హజారా వర్గానికి చెందిన 11 మంది గని కార్మికులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బలూచిస్తాన్‌ ప్రావిన్సు క్వెట్టాలోని మాచ్‌ బొగ్గుగని వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు గని కార్మికులు ఆదివారం ఉదయం విధులకు వెళ్తుండగా సాయుధ దుండగులు వారిని బెదిరించి, సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు. అందులో మిగతా వారిని వదిలేసి, హజారా వర్గం కార్మికులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. సున్నీ తీవ్రవాద సంస్థ లష్కరే జంఘ్వి గతంలో బలూచి స్తాన్‌లోని మైనారిటీ హజారా వర్గంపై పలు మార్లు దాడులకు పాల్పడింది.

మరిన్ని వార్తలు